Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎరుకల కుటుంబంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

ఎరుకల కుటుంబంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

- Advertisement -

– ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టాలి
– సీఎం జిల్లాలో దాడులు బాధాకరం : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు
– తాండూర్‌ మండలంలో బాధిత కుటుంబాలకు పరామర్శ
నవతెలంగాణ-తాండూరు

ఎరుకల కుటుంబాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ నియోజకవర్గంలోని చెన్‌గేష్‌పూర్‌, బెల్కటూర్‌ గ్రామాల్లో వ్యకాస, సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులు పర్యటించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడులకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులు.. తమ సమస్యలను, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు. తమపై అనవసరంగా దాడికి పాల్పడ్డారంటూ తమ బాధను నాయకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ.. చేనిగేష్‌పూర్‌ గ్రామంలో ఎరుకల కులానికి చెందిన శారద బస్వరాజ్‌ పనులు చేసుకొని ఇంటికి వెళ్తున్న గ్రామంలో రోడ్డుపైన రమేష్‌గౌడ్‌ అనే వ్యక్తి ఇంటి దగ్గర అడ్డుకొని బూతులు తిడుతూ.. కులం పేరుతో దూషించినట్టు తెలిపారు. శారద బస్వరాజ్‌ కుటుంబంపై దాడి చేసిన రమేష్‌గౌడ్‌, నరేందర్‌గౌడ్‌, నానిగౌడ్‌, నరేష్‌గౌడ్‌, పవన్‌గౌడ్‌లను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. జిల్లాలో వరుసగా ఎస్పీ, ఎస్టీలపై దాడులు జరుతున్నాయని తెలిపారు. దళిత యువకుడు పెండ్లి ఊరేగింపు బరాత్‌ను అడ్డుకొని దాడి చేసిన ఘటన మరువకముందే.. ఎరుకల కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణ మన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సొంత జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయమని అన్నారు. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లా అధికారులు కానీ పట్టించుకోకపోవడం దుర్మార్గమని తెలిపారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా కేసులు నమోదు చేయడం లేదన్నారు. ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాండూరు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మహిపాల్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె. శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, నాయకులు రఘపతి, నరేష్‌, బాధితులు, బస్వరాజ్‌, శారదా, నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -