– 1533 గజాల విస్తీర్ణంలోని పార్కు స్వాధీనం
– 60 ఏండ్ల పోరాట ఫలితమంటూ స్థానికుల హర్షం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
హైదరాబాద్ మధురానగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని పార్క్ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు ఆదివారం తొలగించారు. మొత్తం 1533 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ”ప్రొటెక్టెడ్ బై హైడ్రా” బోర్డు ఏర్పాటు చేశారు. 1961లో ఏర్పాటు చేసిన సాయి సారధినగర్ లేఅవుట్లో 5 ఎకరాల విస్తీర్ణంలో 35 ప్లాట్లను రూపొందించగా, అందులో ఒక భాగాన్ని పార్కుగా చూపించారు. అయితే, నారాయణ ప్రసాద్ వారసులు స్థలాన్ని ఆక్రమించి షెడ్లు వేసి ఇంటి నంబర్ పొందినట్టు విచారణలో వెల్లడైంది. పార్క్ ఖాళీ చేయకపోవడంపై స్థానికులు పలుమార్లు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి హైడ్రా దృష్టికి తీసుకువచ్చారు. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖలతో కలసి సమగ్ర విచారణ జరిపారు. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించారు. 60 ఏండ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న స్థానికులు దీనిపై హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లారెడ్డిగూడలో పార్కు ఆక్రమణలను తొలగించిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES