నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశా లోని బాలాసోర్లో బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్రంగా స్పందించారు. యువతి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. విద్యార్థిని కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు లైంగిక వేధింపుల ఘటనపై సరైన దర్యాప్తు జరపాలని సీఎం మాఝీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు విద్యార్థిని మృతిపట్ల ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు కూడా విచారం వ్యక్తం చేశారు.
20 ఏండ్ల బాధిత యువతి బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ చదువుతున్నది. ఆమెను తన లైంగిక వాంఛలు తీర్చాలంటూ హెచ్వోడీ సమీర్ కుమార్ సాహూ కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు ఈ నెల 1న అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై వారం రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆమె ఆశించింది. అయితే కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితురాలు, మిగతా విద్యార్థులు శనివారం (ఈనెల 12న) కాలేజీ గేట్ ముందు ఆందోళన నిర్వహించారు.
హఠాత్తుగా బాధిత మహిళ.. ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు పరుగున వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. తోటి విద్యార్థులు వారిని భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు. అయితే బాధితురాలి శరీరం 95 శాతం గాయపడటంతో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం రాత్రి 11.46 గంటలకు మరణించింది.ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అది ముమ్మాటికీ బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్య అని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.