ఎజెండా సవరించాలంటూ
కేంద్రానికి రేవంత్ సర్కార్ లేఖ
తెలంగాణ ప్రతిపాదనలే చేర్చాలని విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్
రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నేడు (బుధవారం) ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్లను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదనీ, వెంటనే ఎజెండాను సవరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది.ఢిల్లీలో నేడు జరుగనున్న సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను కేంద్రానికి పంపించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈ లేఖ రాసింది. ఇప్పటికే కృష్ణాపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎజెండా ప్రతిపాదనలను పంపించింది. జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ లు బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఈ లేఖలో ప్రస్తావించింది. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అందులో ప్రస్తావించింది. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని ఇందులో ఉటంకించింది. కేంద్ర జల సంఘం కూడా ప్రీ ఫీజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలనీ, తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేసింది.
బనకచర్లపై చర్చకు ససేమిరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES