Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో వేలాది ఎకరాల గిరిజన భూములు మాయం

ఛత్తీస్‌గఢ్‌లో వేలాది ఎకరాల గిరిజన భూములు మాయం

- Advertisement -

ద హిందూ సర్వేలో దిగ్భ్రాంతికర వాస్తవాలు
న్యూఢిల్లీ :
ఛత్తీస్‌గఢ్‌లో పంపిణీ చేసిన వేలాది ఎకరాల గిరిజన భూములు మాయమయ్యాయి. ప్రముఖ దినపత్రిక ద హిందూ సర్వేలో ఈ దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. సమాచార హక్కు చట్టం ప్రకారం చేసిన దరఖాస్తు ద్వారా దిన పత్రిక ఈ వివరాలను సేకరించింది. దాదాపు గత 17 నెలల నుంచి రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ) కింద ఈ భూములను పంపిణీ చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రికార్డుల నుంచి ఈ భూముల వివరాలు కనిపించడం లేదు. ఉదాహరణకు బస్తర్‌ జిల్లాలో 2024 జనవరి నాటికి పంపిణీ చేసిన వ్యక్తిగత అటవీ హక్కుల (ఐఎఫ్‌ఆర్‌) టైటిళ్ల సంఖ్య 37,958గా ఉంది. అయితే ఈ ఏడాది మే నాటికి ఈ సంఖ్య 35,180కు తగ్గింది. రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో పంపిణీ చేసిన కమ్యూనిటీ ఫారెస్ట్‌ రిసోర్స్‌ రైట్‌ (సిఎఫ్‌ఆర్‌ఆర్‌) టైటిళ్ల సంఖ్య గతేడాది ఒక నెలలోనే 40 నుంచి 20కు తగ్గింది. బిజాపూర్‌ జిల్లాలో 2024 మార్చి వరకూ 299 సిఎఫ్‌ఆర్‌ఆర్‌ టిటైళ్లను పంపణి చేశారు. అయితే తరువాత నెల నాటికే ఈ సంఖ్య 297కు తగ్గింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే.. మాయమైన గిరిజన భూముల సంఖ్య ఈ విధంగా ఉందని..

వాస్తవానికి ఈ సంఖ్య మరింత భారీగా ఉంటుందని ఎఫ్‌ఆర్‌ఎ పరిశోధకులు, నిపుణులు అంటున్నారు. ఎఫ్‌ఆర్‌ఎ కింద పంపిణీ చేసిన భూములను వెనక్కి తీసుకునే అవకాశమే లేదని చెబుతున్నారు. ఎస్‌టిలు, ఇతర అటవీ నివాసితులకు అటవీ భూములను ఉపయోగించుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది. గ్రామసభలు, సబ్‌-డివిజనల్‌ స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను ఆమోదించిన తరువాత ఈ భూములు పంపిణీ చేస్తారు. ఒకసారి భూములు పంపిణీ చేసిన తరువాత వెనక్కి తీసుకోవడానికి ఉండదు, అలాగే బదిలీ చేయడానికి ఉండదు. అయితే వారసత్వంగా మాత్రమే పొందవచ్చు. కానీ, మౌళిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సంబంధిత గ్రామసభల సమ్మతితో మాత్రమే నిర్ధిష్ట సందర్భాల్లో భూములను సేకరించడానికి చట్టం అనుమతిస్తుంది. హస్దియో అరణ్య బచావో ఆందోళన్‌ కార్యకర్త అలోక్‌ శుక్లా మాట్లాడుతూ ‘2016లో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన కొన్ని భూములను రద్దు చేసింది. అయితే దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది’ అని తెలిపారు.

గిరిజన భూములు మాయం కావడంపై అధికారులు స్పందిస్తూ ‘గ్రామసభ, సబ్‌-డివిజనల్‌, జిల్లా స్థాయిల్లో పనిచేసే అధికారుల మధ్య సమాచార లోపం, రికార్డులు తప్పుగా నమోదవ్వడం.. వంటి కారణాలతో జరిగిఉంటుంది’ అని తెలిపారు. ది హిందూ సేకరించిన సమాచారం ప్రకారం 2025 మే నాటికి, రాష్ట్రంలో ఎఫ్‌ఆర్‌ఎ అమలు చేస్తున్న 30 జిల్లాల్లో మొత్తం 4.82 లక్షల ఐఎఫ్‌ఆర్‌ టైటిళ్లు. 4,396 సిఎఫ్‌ఆర్‌ఆర్‌ టైటిళ్లు పంపిణీ చేశారు. రారుపూర్‌, దుర్గ్‌, బెమెతారా జిల్లాల్లో ఎఫ్‌ఆర్‌ఎ చేయడం లేదు. ఎఫ్‌ఆర్‌ఎపై కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025 మే నాటికి, దేశంలో పంపిణీ చేసిన మొత్తం ఎఫ్‌ఆర్‌ఎ టైటిళ్లలో ఛత్తీస్‌గఢ్‌ వాటా 43 శాతం కంటే ఎక్కువగా ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad