– ఆత్మహత్యకు యత్నించిన తల్లి
– బాచుపల్లిలో ఘటన
నవతెలంగాణ – నిజాంపేట్
దంపతుల మధ్య గొడవలు అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణం తీశాయి. భర్తతో గొడవల నేపథ్యంలో క్షణికావేశంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను సంపులో వేసి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన లక్ష్మణ్, రత్నమ్మ దంపతులు ఉపాధి కోసం వచ్చి బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. వారికి నలుగురు సంతానం. కాగా పెద్ద కుమారులు జగన్, పవన్ సొంత ఊరిలోనే ఉంటున్నారు. అరుణ్(3), సుభాన్ (8 నెలలు) వారి వద్ద ఉంటున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ నియంత్రణ, ఇతర ఆర్థిక విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఇదే విషయమై బుధవారం తెల్లవారుజామున భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. అనంతరం లక్ష్మణ్ బయటికి వెళ్లిపోవడంతో రత్నమ్మ ఇద్దరు చిన్న కుమారులను తాము ఉంటున్న అద్దె ఇంట్లోనే నీటి సంపులో వేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా అదే సంపులో దూకింది. పక్కింటి వారు గమనించి వెంటనే రత్నమ్మను బయటికి తీశారు. అనంతరం అరుణ్, సుభాన్ను సంపులోంచి బయటికి తీయగా అప్పటికే చనిపోయారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. రత్నమ్మను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పిల్లల మృతదేహాలను కూడా గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.