నవతెలంగాణ-హైదరాబాద్: మొదటిసారి రుణం కోసం ప్రయత్నిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవలం సిబిల్ స్కోర్ (క్రెడిట్ స్కోర్) లేదనే కారణంతో వారి రుణ దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో కీలక ప్రకటన చేశారు.
లోక్సభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కొత్తగా రుణం తీసుకునేవారికి క్రెడిట్ హిస్టరీ ఉండదనే విషయాన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవాలని పంకజ్ చౌదరి సూచించారు. “మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి క్రెడిట్ హిస్టరీ లేదనే ఏకైక కారణంతో వారి దరఖాస్తులను తిరస్కరించవద్దని బ్యాంకులకు, ఇతర రుణ సంస్థలకు ఆర్బీఐ స్పష్టమైన సూచనలు జారీ చేసింది” అని ఆయన వివరించారు.