నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్త ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొమ్మిది రోజులు పూజలందుకున్న మహాగణపతిని నిమజ్జనం కోసం విజయవాడ నుంచి తీసుకువచ్చిన భారీ టస్కర్ పై ఎక్కించి వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది.
ఖైరతాబాద్ గణేశుడిని ఎక్కించిన టస్కర్ 26 టైర్లతో 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 200 టన్నుల బరువును అలవోకగా ఎత్తగల సామర్థ్యం దీని సొంతం. శుక్రవారం అర్ధరాత్రి టస్కర్పై విగ్రహాన్ని కూర్చోబెట్టే వెల్డింగ్ పనులు మొదలుపెట్టారు. తెల్లవారుజాములోపే ఈ పనులు కంప్లీట్ చేసి భారీ గణనాథుడిని టస్కర్పైకి ఎక్కించారు. తర్వాత మండపంలో ఎలాంటి బేస్గడ్డర్స్ఉన్నాయో..అదే సైజ్లో టష్కర్పై ఐరన్ గడ్డర్స్ తో వెల్డింగ్ చేశారు. టస్కర్పై కూర్చోబెట్టిన తర్వాత కదలకుండా వెల్డింగ్ చేశారు. వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్ స్తంభాలతో బలమైన బేస్ను ఏర్పాటు చేసి, విగ్రహాన్ని సురక్షితంగా హుస్సేన్ సాగర్ తీరంలోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు తరలించేందుకు సిద్ధం చేశారు.
మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ నుంచి ఇక్బాల్ మినార్, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి, సెక్రటేరియేట్ మీదుగా సాగి..ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం కానున్నది.