రూ.4 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
వెయ్యి గజాల ప్లాట్కు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్
నవతెలంగాణ-గండిపేట్
రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఓ ఇంటికి ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం అధికారి లంచం డిమాండ్ చేయగా.. ఇంటి యాజమాని ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుని నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి వెయ్యి గజాల ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం నార్సింగి మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. అప్పటికే ప్రభుత్వానికి రూ.6లక్షలు చెల్లించాడు. క్లియరెన్స్ కోసం ఆరు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఈ క్రమంలో టౌన్ప్లానింగ్ అధికారి మణిహారిక బాధితుడిని రూ.10లక్షలు డిమాండ్ చేసింది. అతను అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.5లక్షలు ఇవ్వాలని కోరింది. అయితే రూ.4లక్షలు ఇస్తానని చెప్పాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారుల ను ఆశ్రయించాడు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాల యంలో మణిహారికకు రూ.4లక్షలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ కార్యాల యంలో విచారణ చేపట్టారు. విలువైన డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను పరిశీలించారు. అలాగే టౌన్ ప్లానింగ్ అధికారి నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ అవినీతిలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో పూర్తిస్థాయి లో దర్యాప్తు చేస్తున్నారు. మణిహారికను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు దృష్టికి తీసుకు రావాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. నార్సింగి మున్సిపాలిటీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తు న్నారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏసీబీకి చిక్కిన నార్సింగి టీపీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES