నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసక సెంచరీ సాధించడంతో పొట్టి ఫార్మాట్లో 300 పరుగుల మైలురాయిని దాటిన తొలి టాప్ టీమ్గా (ఫుల్ మెంబర్ దేశం) ప్రపంచ రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ ఈ అరుదైన ఘనతను అందుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 304 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 60 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి కెప్టెన్ జోస్ బట్లర్ కూడా తోడవడంతో ఇంగ్లండ్ స్కోరుబోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
బట్లర్ కేవలం 30 బంతుల్లో 83 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వచ్చిన జాకబ్ బెతెల్ (26), హ్యారీ బ్రూక్ (41 నాటౌట్) కూడా తమ వంతు రాణించడంతో ఇంగ్లండ్ చారిత్రక స్కోరును అందుకుంది.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు నేపాల్ (మంగోలియాపై 314/3), జింబాబ్వే (గాంబియాపై 344/4) మాత్రమే 300కు పైగా పరుగులు చేశాయి. అయితే, రెండు పూర్తిస్థాయి సభ్య దేశాల మధ్య జరిగిన మ్యాచ్లో 300 పరుగుల మార్క్ దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం.