ఎన్ఈపీని రాష్ట్రంలో అమలు చేయొద్దు : జాన్వెస్లీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నూతన విద్యావిధానం (ఎన్ఈపీ-2020)ని రాష్ట్రంలో అమలు చేయొద్దనీ, అంగన్వాడీల వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టిన అంగన్వాడీ టీచర్లపై లాఠీచార్జీ చేసి, అరెస్టులు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్లు, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మిపై పోలీసులు లాఠీచార్జీ చేయడం సరైంది కాదని తెలిపింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ-2020) వల్ల ఐసీడీఎస్తోపాటు, విద్యా వ్యవస్థకు ప్రమాదకరమైన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకుంటున్నదని విమర్శించారు. దీని వల్ల పేద ప్రజలతోపాటు, అంగన్వాడీ వర్కర్లు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలను రాష్ట్రంలో అమలు చేయొద్దనీ, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని కోరారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.