సీఎం కప్ సమీక్షలో క్రీడామంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్
సీఎం కప్ 2025 నిర్వహణతో గ్రామీణ ప్రతిభను గుర్తించి, తగిన విధంగా ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ ఏడాది సీఎం కప్ నిర్వహణపై గురువారం గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాశాఖ అధికారులు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘సీఎం కప్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యం ఉండేలా చూస్తాం. గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులను గుర్తించటంతో పాటు ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి సమాచారం నిక్షిప్తం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని’ వాకిటి శ్రీహరి అన్నారు. సీఎం కప్ లక్ష్యాలను గ్రామీణ స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లేందుకు క్రీడా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించాలని, సీఎం కప్ సహా క్రీడా జ్యోతి షెడ్యూల్ను త్వరలోనే వెల్లడిస్తామని క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ శివసేనా రెడ్డి అన్నారు. సీఎం కప్ పోటీల నిర్వహణలో ఒలింపిక్ సంఘం, క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శాట్జ్ ఎండీ సోనీబాల దేవి, జిల్లా క్రీడాభివృద్ది అధికారులు, క్రీడాశాఖ ఉన్నతాధికారులు, శాట్జ్ డిప్యూటీ డైరెక్టర్లు, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు తదితరులు పాల్గొన్నారు.