నవతెలంగాణ – హైదరాబాద్ : రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరగనున్న కీలక పోరుకు ముందు భారత జట్టును ఓ ఆందోళన వెంటాడుతోంది. కీలక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటమే దీనికి కారణం. ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో పాకిస్థాన్తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్కు అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.
ఒమన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిడ్ ఆఫ్ నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి, వికెట్ కీపర్ హమ్మద్ మీర్జా కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో అక్షర్ పటేల్ అదుపుతప్పాడు. క్యాచ్ను జారవిడిచి, తల నేరుగా నేలకు బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి పరీక్షించగా అతని సహాయంతో అక్షర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు.
అయితే, మ్యాచ్ అనంతరం ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ మాట్లాడుతూ అక్షర్ బాగానే ఉన్నాడని స్పష్టం చేశాడు. అయినప్పటికీ, మ్యాచ్ల మధ్య కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అతను పాక్తో మ్యాచ్కు సిద్ధమవుతాడా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. ఒకవేళ అక్షర్ ఈ మ్యాచ్కు దూరమైతే టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దుబాయ్లో ఆడిన అన్ని మ్యాచ్లలో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్, ఈ ప్రణాళికను పక్కన పెట్టే అవకాశం ఉంది. స్టాండ్బై జాబితాలో ఉన్న స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకునే అవకాశాలను పరిశీలించవచ్చు.