హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరిన మంత్రి కొండా సురేఖ
బతుకమ్మ కుంట పునరుద్ధరణ భేష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బతుకమ్మ కుంట పునరుద్ధరణ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చొరవ భేష్ అంటూ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. దేవాదాయ భూముల పరిరక్షణకు హైడ్రా సాయం కావాలని మంత్రి కోరగా…సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హామీనిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి ఛాంబర్లో కొండా సురేఖతో రంగనాథ్ భేటీ అయ్యారు. బతుకమ్మ కుంట వేడకులకు మంత్రి సురేఖను రంగనాథ్ ఆహ్వానించారు. దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురికావటం పట్ల మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పరిక్షించేందుకు ఇప్పటికే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నట్టు వివరించారు.
అందుకోసం ప్రభుత్వ, శాఖ పరంగా కావాల్సిన సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తామని మంత్రి చెప్పారు. హైడ్రా వచ్చాక చేపట్టిన పనుల వివరాలను మంత్రికి రంగనాథ్ వివరించారు. మంచి పనులు చేసే సందర్భంగా కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయనీ, సామూహిక ప్రయోజనంలో భాగంగా చేశారని మంత్రి సురేఖ కొనియాడారు. హైడ్రా చేస్తున్న పనులు రానున్న కాలంలో అందరికీ తెలుస్తాయని అన్నారు. వరంగల్ నాలాల ఆక్రమణల గురించి కూడా రంగనాథ్తో మంత్రి చర్చించారు. వాటిని పరిష్కరించేందుకు తమకు సహకరించాలని కోరారు. అందుకు ఆయన సుముఖత తెలిపారు.