ఎస్ఎంఇలకు రూ.5 కోట్ల వరకు అప్పు
త్వరలో యోనో యాప్ ఆధునీకరణ
ఎస్బిఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి వెల్లడి
ముంబయి : డిజిటలీకరణ ఫైనాన్సీయల్ రంగం రూపురేఖలనే మార్చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఇప్పుడు నిమిషాల్లోనే రుణాలు మంజూరు జరుగుతోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025 ఈవెంట్లో శ్రీనివాసులు మాట్లాడుతూ.. డిజిటల్ వ్యవస్థల కారణంగా ఎస్ఎంఇలకు కేవలం 25-26 నిమిషాల్లో రూ.5 కోట్ల వరకు రుణానికి ఆమోదం లభిస్తోందని తెలిపారు. డిజిటలీకరణ వల్ల ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక ఉత్పత్తుల వినియోగం పెరిగిందన్నారు. కెవైసి నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, రెగ్యూలేటరీ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కెవైసి, రీ-కెవైసి ప్రక్రియలను సరళీకరించడం కస్టమర్లకు, బ్యాంకులకు చాలా ముఖ్యమన్నారు. కస్టమర్ డేటాను అప్డేట్ చేయడం, మోసాలను నివారించడం లక్ష్యంగా ఉన్నప్పటికీ, విభిన్న పద్ధతుల వల్ల రీ-కెవైసి చాలా మందికి సమస్యగా మారిందన్నారు. ఒక్క ఎస్బిఐ ద్వారా 15 కోట్ల జన్ధన్ జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచామని చెప్పారు. సగటున రూ.4వేలు చొప్పున ఒక్కో బ్యాంకు ఖాతాలో నగదు ఉందని, ఈ ఖాతాల ద్వారా రోజుకు 35 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ఈ ఖాతాలు 56 శాతం మహిళలవే అని తెలిపారు. త్వరలో యోనో యాప్ను మరింత ఆధునీకరించనున్నామని చెప్పారు. ఇందుకోసం 12 ఫిన్టెక్ సంస్థలతో పని చెస్తోన్నామని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్ మాత్రమే కాకుండా మరిన్ని సదుపాయాలు ఇందులో అందుబాటులోకి రానున్నాయన్నారు. ”ఎస్బిఐకి ప్రస్తుతం 1.6 లక్షల టచ్పాయింట్లు ఉన్నాయి. డిజిటల్ ఛానెళ్లతో పాటు, దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులో ఉండేలా భౌతిక ఔట్లెట్లను కూడా మెరుగుపరుస్తున్నాము. మా బ్యాంక్ 60 శాతం శాఖలు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయి. ఎస్బిఐలో 25 లక్షల మంది బిజినెస్ కరస్పాండెంట్లు పని చేస్తున్నారు. మేము 52 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాము. దేశ జనాభా, భౌగోళిక వైవిధ్యం కారణంగా బ్యాంకింగ్ సేవల లభ్యతను పెంచడం ఓ సవాల్గా ఉంది. ఎస్బిఐ సాధారణ బ్యాంకింగ్ నుండి వెల్త్ మేనేజ్మెంట్ వరకు అన్ని సేవలు అందిస్తుంది.” అని శ్రీనివాసులు శెట్టి తెలిపారు.
డిజిటలీకరణతో నిమిషాల్లో రుణాలు
- Advertisement -
- Advertisement -