నవతెలంగాణ-హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయనతో కేంద్ర మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఢిల్లీలో అమీర్ ఖాన్ ముత్తాకీ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ విలేఖర్ల సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేరు. కేవలం పురుష జర్నలిస్టులను మాత్రమే పిలిచి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఇది తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్రం తీరును ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎంపీ ప్రియాంకా వాద్రా స్పందించారు.
ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ‘‘భారతదేశంలో అత్యంత సమర్థులైన మహిళలను అవమానించడం మన దేశంలో ఎలా అనుమతించబడిందని నిలదీశారు. దేశానికి మహిళలు వెన్నెముక, గర్వకారణం’’. అని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కీలక పోస్ట్ పెట్టారు. ఆఫ్ఘనిస్థాన్ మంత్రి పెస్మీట్లో మహిళలను అనుమతించనప్పుడు పురుష జర్నలిస్టులు ఎందుకు బహిష్కరించలేదని అడిగారు. మీడియా సమావేశం నుంచి వాకౌట్ చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ విషయం తనకు షాకిచ్చిందన్నారు.
విమర్శలపై కేంద్రం స్పందించింది. ప్రెస్మీట్ ఆహ్వానాలు ముంబైలోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ జనరల్ నుంచే ఎంపిక చేస్తారని.. ఎంపిక చేసిన జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానాలు అందాయన్నారు. ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం కేంద్ర ఆధీనంలో ఉండదని.. ఇది వారి ఎంపిక మాత్రమేనని స్పష్టం చేసింది.