అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కమల్ హాసన్, గోపాల కృష్ణ గాంధీ సందేశాలతో రూపొందిన ‘లీడ్ ఆన్ గాంధీ’ అనే డాక్యుమెంటరీ శుక్రవారం విడుదలైంది. భారతదేశ నైతికత, ప్రజాస్వామ్య విలువల నుంచి పుట్టిన గొంతులు ఇందులో ఇంటెన్స్గా వినిపిస్తాయి. ఈ డాక్యుమెంటరీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీని హత మార్చిన బుల్లెట్ ప్రయాణాన్ని ఇటలీ గనుల నుంచి, న్యూఢిల్లీ బిర్లా హౌస్ వరకు చూపించిన తీరు ఆలోచన రేకెత్తించేలా వుంది. ఒకే ఒక బుల్లెట్ కథ ద్వారా, హింస ఎలా దేశాలు, సరిహద్దులు దాటుతుందో, శాంతి ఆలోచనలు మాత్రం ఎంత కష్టంగా ప్రయాణిస్తాయో ఈ ఫిల్మ్ స్పష్టంగా చూపిస్తుంది. ఇది కేవలం చరిత్రాత్మక డాక్యుమెంటరీ కాదు.
1948 జనవరి 30న మనం ఏమి కోల్పోయామో ఆలోచింపజేసే ఫిల్మ్. నేటి ప్రపంచంలో విభజన, అసహనం సాధారణమవుతున్న సమయంలో అహింసను బలహీనతగా చూసినప్పుడు ఏమవుతుంది?, గాంధీ చూపిన నైతిక ధైర్యాన్ని సమాజం మరిచితే పరిణామాలు ఏంటి? అనే అవసరమైన ప్రశ్నలను ఈ ఫిల్మ్ సంధిస్తోంది. కమల్ హాసన్ దృష్టికోణం ద్వారా ఈ చిత్రం గాంధీజీ హత్యను నేటి కాలంతో అనుసంధానిస్తూ, కోపం-ప్రతీకారాలకన్నా ప్రేమ, సత్యం, ఆత్మ నియంత్రణకు ఎక్కువ ధైర్యం అవసరమని గుర్తు చేస్తుంది. అమరవీరుల దినోత్సవం నాడు విడుదలైన ”లీడ్ ఆన్ గాంధీ” జాతిపితకు నివాళిగా మాత్రమే కాకుండా ప్రజాజీవితంలో సానుభూతి, సంభాషణ, అహింస విలువలను తిరిగి గుర్తు చేసుకునేలా చేసే ఒక బలమైన పిలుపునిచ్చింది. గాంధీజీ అనే మనిషిని బుల్లెట్ చంపింది, కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఈ డాక్యుమెంటరీ గుర్తు చేస్తుంది మేకర్స్ తెలిపారు.
జాతిపితకు ఘనమైన నివాళి..
- Advertisement -
- Advertisement -



