Wednesday, September 24, 2025
E-PAPER
Homeఖమ్మంరాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు..

రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు..

- Advertisement -

– రైతుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు..
– ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,సభ్యుల ప్రమాణ స్వీకారం..
– 966  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు,

19 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు
రూ.19,02,204  చెక్కుల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలో అశ్వారావుపేట డివిజన్ లో కొత్తగా ఏర్పాటు అయిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ – ఆత్మ కమిటీ రైతు సంక్షేమానికి ముఖ్యమైన ఘట్టంగా రైతు సలహా కమిటీ చైర్మన్, 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, 966 ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ, అలాగే కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాల కింద 19 లబ్ధిదారులకు  రూ.19, 02,204 చెక్కుల పంపిణీ కార్యక్రమం అశ్వారావుపేట శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడింది. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ,జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు మరియు 24 సభ్యులు నియామక పత్రాలు అందచేసి, అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మ కమిటీ చైర్మన్ పదవికి నియామకం ఒక పెద్దాయనకు న్యాయం చేయడం, రైతుల సంక్షేమం, పేద వర్గాల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ రోజున ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి పేదవాడికి నిజమవ్వాలని, రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడి కి ఇల్లు, ఆర్థిక మద్దతు, భరోసా మరియు భద్రత అందించడం ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టంగా చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే గ్యాస్, గత ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 11 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు, సుమారు 7 లక్షల మంది పాత రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు.

ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు అయ్యాయని, ప్రతి పేదవాడికి హక్కులు, వసతులు సులభంగా అందించ బడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేనప్పటికీ ఎటువంటి ఆర్భాటాలకు పోవటం ఏది చేయగలము ఏది చేయలేము అని అంచనాతో ప్రతి వర్గానికి చెబుతూ పేదవాడి గౌరవానికి భంగం కలగకుండా ఉండేవిధంగా పేదవాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా పేదవాడికి పూర్తి మద్దతుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి పేదవారికి మంచి చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇల్లు అనేది పేదవారి ఆత్మగౌరవం అని వారి భరోసా భద్రత కల్పించే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవారికి అందిస్తున్నామని తెలిపారు.

రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం నుండి ఫౌండేషన్ గృహప్రవేశాలు వరకు విడతల వారీగా లబ్ధిదారునికి ఖాతాలో నేరుగా ప్రతి సోమవారం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పేదవారు ఎక్కడా తలదించుకోకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల పేదవారి అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.

శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం రాష్ట్రంలోనే  మొదటిసారిగా అశ్వారావుపేట నియోజకవర్గంలో నిర్వహించబడుతున్నందుకు సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పేద వర్గాల సంక్షేమానికి అవకాశం సృష్టించడం గొప్ప కార్యక్రమం అని అన్నారు. అదేవిధంగా కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన చెక్కుల పంపిణీ ద్వారా పేద వర్గాలకు నేరుగా లబ్ధి చేరడం ముఖ్యమని, ఈ అవకాశాలు రైతుల జీవితాలను సుస్థిరంగా మార్చతాయని పేర్కొన్నారు.

 జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, ఇళ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, ఆత్మ కమిటీ సభ్యులు పంటల, వ్యవసాయ, చేపల పెంపకం మరియు ఇతర సబ్సిడీ స్కీమ్స్ లో నేరుగా లబ్ధి పొందే విధంగా జిల్లా యంత్రాంగం మద్దతు ఇస్తుందని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో కొత్త వ్యాపార, ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యల పరిష్కారం, సబ్సిడీ స్కీమ్స్ లో పారదర్శకత, ఇళ్ల నిర్మాణ పథకాల్లో సక్రమ పేమెంట్లు, ఫోన్లు, లాగిన్ లో పెండింగ్ వివరాలు పూర్తిగా క్లియర్ చేయడం మొదలైన అంశాలు పేదవర్గాల సంక్షేమానికి ప్రధాన మార్గదర్శకమని కలెక్టర్ తెలిపారు.

 అనంతరం మంత్రి చేతుల మీదగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, హౌసింగ్ పిడి రవీంద్రనాథ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -