తెలంగాణ యాసని తలచుకోగానే ఓ ఉత్తేజం, ఉత్సాహం మనలో చెలరేగుతుంటాయి. ఆ యాస పాటలో పరిమళిస్తే కాళ్ళు ఆగవు. నింగినంటే దరువుతో, ఊపుతో ఊగిపోతుంటాం. అలాంటి ఊపు కలిగిన పాటను సాహితి రాశాడు. 1992 లో వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
సాహితి లబ్ధ ప్రతిష్ఠుడైన గీతరచయిత, మహా మహాకవుల సరసన నిలబడి ధీటుగా పాటలు రాసిన మేటైన కవి. ఆయన గురించి, ఆయన పాటల గురించి తెలుగు సినీలోకానికి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’ సినిమాలో ఆయన రాసిన ఈ పాట ఆయనకు ఎంతో గుర్తింపునిచ్చింది. అంతే కాదు తెలుగు సినిమాల్లో 100 ఉత్తమ గీతాల జాబితాలో ఈ పాటకు స్థానముంది. సాహితి కష్ణాజిల్లాకు చెందిన కవి. అయినా తెలంగాణయాసలో ఎంతో అద్భుతంగా ఈ పాటను రాశాడు. కవికి ఎల్లలు లేవు.. యాసలు వేరయినా మన భాష తెలుగుభాష కదా. ఈ విషయాన్ని ఇక్కడ గ్రహించుకోవాలి.
ఈ పాటలో హీరో, హీరోయిన్ ఒక విందు కార్యక్రమానికి వెళతారు. హీరో సుమన్ పోలీస్ ఆఫీసర్. హీరోయిన్ విజయశాంతి తెలంగాణకు చెందిన అమ్మాయి. పల్లెటూరిలో పెరిగింది. గడుసుదనం కలిగినది. ఆమె మాట, చేత అన్నీ మోటుగా ఉంటాయి. చదువు సంధ్య లేని అమ్మాయి కనుక అక్కడ నగర వాతావరణానికి తొందరగా అలవాటు పడదు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఆమె తనకు వచ్చిన తెలంగాణ యాసలో తన భర్తనే ప్రియుడిగా భావించి ఓ మాస్ గీతాన్ని ఎత్తుకుంటుంది. చరణంలో పోలీస్ ఉద్యోగ బాధ్యతను గురించి, వారి కష్టాన్ని గురించి కూడా ప్రస్తావిస్తుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా దాదాపు పోలీస్ ఆఫీసర్లే.. ఆమె పాడే పాటను వాళ్ళంతా హుషారుగా, శ్రద్ధగా వింటూ ఎంజారు చేస్తారు. ఇదీ ఇక్కడి సందర్భం.
హైదరాబాద్లో ఉండే వింతలు, విశేషాలు చెబుతూ ప్రియున్ని ప్రియురాలు కొంటెగా ఇలా అడుగుతుంటుంది. లాలూ దర్వాజ దగ్గర జరిగే లష్కర్ బోనాలకు నువ్వు వస్తానని చెప్పి ఎందుకు రాలేదు. లక్డీకాపూల్ పోరికి రబ్బరు గాజులు తెస్తానని చెప్పి ఎందుకు తీసుకురాలేదని అంటుంది. కాని పాటలో రబ్బరుకు బదులు లబ్బరు అని వాడడం జరిగింది. తెలంగాణ యాసలో జానపదశైలిలో.. రబ్బరు కాస్త లబ్బరుగా ఇక్కడ ఉచ్చరించడం జరిగిందని గ్రహించాలి. వట్టి మాటలు చెప్పిన చెలికాడు నేను వెంట వచ్చేదాకా ఎంతో లొల్లి చేసి తీరా పట్టుకుంటే ఫలక్నుమా పారిపోయాడు. ఇదేం గారడి అని అంటోంది.
ఆ పారిపోయినవాడే నా చెలికాడు. వాడినే నేను ఇష్టపడ్డాను. వాడు పోలీస్ ఆఫీసర్.. వాడినే ప్రేమించాను. కృష్ణుడి కంటే వాడు మహా కొంటెవాడు. నాకు కన్నుకొట్టాడు. వాడినే నేను గుండెలో దాచుకున్నాను. వాడినే నేను పెళ్ళి చేసుకున్నాను. అని తన భర్త గురించే చెబుతుంది. వాడికి నెమలిపింఛం ఒక్కటే తక్కువ. అంతే.. నిజంగా కృష్ణుడికి ఏం తీసిపోడు. వాడి చేష్టలన్నీ కృష్ణుడివే. అని చెబుతుంది. వాడికున్న పొగరు నాకెంతో ఇష్టం. అయినా నాకు మాత్రం ఏం తక్కువ. వాడే పుస్తగట్టి నాకు మొగుడయ్యాడంటే నేను అదృష్టవంతురాలినన్నట్టే కదా. అని అంటుంది. ఇక్కడ తన భర్త గొప్పతనం చెప్పి, తను కూడా తక్కువేమీ కాదు అని అంటూనే తనకు భర్తకు వచ్చిన వాడివల్లనే తన విలువ పెరిగిందంటుంది. ఇక్కడ కూడా తన భర్తవల్లనే తనకు గౌరవం దక్కిందనే విషయం స్పష్టం చేస్తుంది. అలాంటి అందగాడు ఎక్కడికో పోతాడని, పట్టుకొచ్చి ముక్కుతాడేసి దాచేసుకున్నా.. అని చెబుతుంది. కొంగులాగిన ఆ కొంటెవాడితో కొంగుముడి వేయించుకున్నానంటుంది.
ఇవన్నీ తీపిజ్ఞాపకాలు. ఇపుడిలా మీతో మళ్ళీ పంచుకుంటున్నా.. అని చెబుతుంది. నేను ఇలా వదరుబోతులాగా వేగంగా చెబుతూ పోతున్నా.. మీకు అర్థమవుతుందా? అని అంటుంది.
ఇక రెండవ చరణంలో పోలీస్ ఉద్యోగం గురించి, వాళ్ళ కష్టం గురించి చెబుతుంది. తన భర్త కూడా పోలీస్ ఉద్యోగియే కాబట్టి తాను అనుభవించినదే ఈ చరణంలో ప్రస్తావిస్తుంది. పోలీస్ ఉద్యోగమంటేనే చాలా కష్టంతో కూడుకున్నది. టోపీ పెట్టుకున్న గూర్ఖా కన్నా, బీడి కార్మికుడి కన్నా పోలీస్ ఉద్యోగి జీవితం చాలా దారుణం. గదిలో భార్యతో ఉన్నా అర్జెంట్ ఉందని ఫోన్ రాగానే పరుగులు పెట్టాలి. తిండి ఉండదు. నిద్ర ఉండదు. ఎండ, చలి, వాన ఏమీ ఉండవు. పొద్దున లేచినప్పటినుంచి ఖూనీకేసులు, ఎవరైనా చస్తే శవాలు కాల్చేదాకా కాపలాకాయడాలు, పోస్టుమార్టం అయ్యేదాకా అన్నీ ఏర్పాట్లు చూసుకోవడాలు.. ఇదే పోలీస్ జీవితం. బంద్లు ఉంటే వీధులు అన్నీ తిరిగి ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా కాపలా కాయాలి. తుపాకీలెత్తి కాల్పులు చేయాలి. బదిలీ వేస్తే అడవికైనా సరే వెళ్ళి డ్యూటీలు చేయాలి. భార్యాబిడ్డల్ని వదిలేసి అడవుల్లోనే బతకాలి. అందుకు సిద్ధంగా ఉండాలి. అడవిలో ఆకులు, అలములు తిని రోజులు గడపాలి. ఇంత కష్టమైన జీవితం పోలీస్ జీవితం. నేను చెప్పేది నమ్మండి. నేను సత్యమే చెబుతున్నానంటుంది. సరదాతో పాటు పోలీస్ జీవితాల కష్టమూ ఈ పాటలో కనబడుతుంది.
ఈ పాట పల్లవిలోనే ‘లాలూ దర్వాజ’, ‘లష్కర్ బోనాలు’, ‘లక్డీకాపూల్’, ‘ఫలక్ నుమా’ వంటి హైదరాబాదీ సౌందర్యం గుబాళిస్తుంది. ఇదే పాటకు మరింత ఘాటునిచ్చిందని, ఊపునిచ్చిందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
ఈ పాట మొత్తం ఓ కథ చెబుతున్నట్టుగా సాగుతుంటుంది. ఈ పాటలో వున్న తెలంగాణ పదాలు భలేగా పేలాయి. ‘పోరి’, ‘పుస్తెగట్టడం’, ‘పెనిమిటి’, ‘పోరగాడు’, ‘లొల్లివెట్టడం’, ‘ఉరుకుతాడు’, ‘జర..గుస్స జైకుండ్రీ,’ ‘సచ్ఛా జెప్తున్నా’ వంటి పదాలన్నీ తెలంగాణలో తరచుగా వాడేవే. సచ్ఛా జెప్పడమంటే సత్యమే చెబుతున్నానని అర్థం. ‘జర..గుస్స జైకుండ్రీ’ అంటే కొంచెం కోపగించుకోకండి అని అర్థం. ‘బందూక్’ అంటే తుపాకి అని అర్థం. ‘సమజ్ అయినదా?’ వంటి ఉర్దూపదం కూడా తెలంగాణలో తరచుగా వాడేవే.
ఇలా తెలంగాణ యాసలో హైదరాబాదీ స్టైల్ లో చెలరేగిన పాట ఇది. మనల్ని హుషారెత్తించిన పాట ఇది. ఈ పాట వచ్చి నేటికి 32 ఏళ్ళు గడిచినా దీని ఊపు ఇంకా తగ్గలేదనడం అతిశయోక్తి కాదేమో.
పాట:
లాలూదర్వాజ లష్కర్ బోనాల్/ పండగకస్తనని రాకపోతివి/ లకిడీకాపూల్ పోరికి లబ్బర్/ గాజులు తెస్తనని తేకపోతివి/ అవ్ మల్ల.. ఒట్టి జూట మాట చెప్పి/ ఒచ్చేదాక లొల్లిపెట్టి/ పట్టుకుంటె పోరగాడు/ ఫలకనామ పారిపోయె..తుర్ర్../ ఆడే సెలికాడు నాకు/ లాఠీ పోలీసు ఓడు/ ఆడ్నే పేమించినాను.. సై..సై..సై../ కిష్ణా నీకంటెవాడు ఇంకా మా కొంటెవాడు/ కన్నే కొట్టిండు నాకు.. హౌరు.. హౌరు..హౌరు/ నెమలిపింఛమొకటి తక్కువా/ ఆడి పొగరు జూస్తె తగని మక్కువ/ యహ నాకు మాత్రమేమి తక్కువా/ ఆడె పుస్తకట్టి పెనిమిటవ్వగా/ యాడికో ఉరుకుతాడనే/ ఏసినా ముక్కుతాడునే/ కొంగు లాగినోడితోనే కొంగుముళ్ళు ఏసుకున్న/ ఏడుకైన కన్నె ఊసు నేడు మల్ల చెప్పుకున్న/ కుర్ర్..సమజైనదా?/ టోపి సప్రాసికన్న బీడీ బంట్రోతు కన్న/ పోలీస్ పటేల్ బత్కు డారు డారు డారు/ గదిలో పెండ్లంతో ఉన్న గంటల్ ఫోనొస్తె మల్ల/ ఎంటన్ పెట్టాల పర్గు రరు రరు రరు/ పొద్నలేస్తే ఖూనికేసులు/ పీన్గలెత్తె దాక సావుకాపులు/ బందులైతే గస్తి తిర్గుడు/ ఆడ బందూకెత్తి గోలికాల్పులు/ ఉండవే కంటినిద్రలు/ యాలకే తిండితిప్పలు/ అడివికెల్లి బదలిఇస్తే ఆలుబిడ్డ యాదమర్చి/ ఆకు అలం మెక్కుడేలే/ మీకు బలం మింగుడేలే..కుర్ర్../ జర గుస్స జైకుండ్రీ.. నే సచ్ఛా జెప్తున్నా..
– డా||తిరునగరి శరత్చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682