Sunday, June 29, 2025
E-PAPER
Homeకథఓ వర్షం రాత్రి

ఓ వర్షం రాత్రి

- Advertisement -

సాయంకాలం! హోరుమనీ వర్షం పడుతోంది. ఆ సమయంలో బస్సు కొండపాలెం అడ్డురోడ్డు దగ్గర ఆగింది. కండక్టర్‌ గట్టిగా ‘కొండపాలెం అడ్డురోడ్డు’ అనీ అరిచాడు. ఆ అరుపు విని హేమంత్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
వెంటనే తన బేగు తీసుకొని కిందకు దిగిపోయాడు. బయట వర్షం ధారగా కురుస్తోంది. బస్సు దిగిన కొద్ది క్షణాల్లోనే అతను బాగా తడిసిపోయాడు. సమయం ఐదుగంటలే అయినా నల్లటి మబ్బుల వల్ల చీకటిగా ఉంది. అతను బేగుని తలమీద పెట్టుకొని అక్కడికి దగ్గర్లో ఉన్న రావిచెట్టు కిందకు వెళ్ళాడు. అప్పటికే అక్కడ పదిమంది వరకూ నిలబడి ఉన్నారు.
రాను రాను వర్షం ఉదతమౌతోంది. మధ్యలో పెళ పెళమని ఉరుములు, కళ్ళు చెదిరిపోయేంతటి వెలుగుతో మెరుపులు. వీటికి తోడు ఉదతమైన గాలి.
హేమంత్‌కి ఆ వాతావరణం భయం కలిగిస్తోంది. తను ఇప్పుడు కొండపాలెం వెళ్ళాలి. వెళ్ళాలంటే వేగావతి ఏరు దాటాలి. ఏరు గుర్తుకు రాగానే అతని దష్టి ఎదురుగా ప్రవహిస్తున్న వేగావతి ఏటి మీదకు మరలింది. ఎర్రటి బురద నీటితో రెండు గట్లనూ ఒరుసుకుంటూ హోరుమని శబ్దం చేస్తూ పారుతుంది వేగావతి.
కొండపాలెం వెళ్ళాలంటే ఏరు దాటక తప్పదు. వేసవైతే పెద్దగా నీరుండదు కాబట్టి నడుచుకుంటూ దాటేయవచ్చు. కానీ వర్షాకాలంలో పడవ మీదే దాటాలి. ఒక పక్క ఆ ఊరు ఎలా వెళ్ళాలా అన్న ఆలోచనలతో అతని మస్తిష్కం వేడెక్కిపోతుంటే మరో పక్క ఆ వాతావరణం అతనికి ఆనందం కలిగించ సాగింది. హేమంత్‌కి వర్షాన్ని చూస్తే చాలా ఇష్టం. వర్షం పడుతుంటే దాన్ని చూస్తూ గంటలు గంటలు గడిపెయ్యగలడు. చిన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు తడుస్తూ అందులో కాగితం పడవలు వదిలేవాడు. అందులో తడిసి ముద్దయ్యేవాడు. అతని తల్లి కోప్పడుతున్నా ఇంట్లోకి వచ్చేవాడు కాదు.


మళ్ళీ చాలారోజులకు అతను వర్షాన్ని చూస్తున్నాడు. అతను నిలుచున్న రావిచెట్టు చాలా విశాలంగా ఉండటంతో వర్షం మీద పడటం లేదు కానీ బయట ధారాపాతంగా కురుస్తోంది వర్షం. ఆ సమయంలో అతనికి ఆ కుండపోత వర్షాన్ని చూస్తుంటే ఎప్పుడో ఇంట్లో చదివిన ఇంగ్లీషు పాఠంలోని ‘Life is not about aiting or the storm to pass, its about learning to dance in the rain ” అన్న వాక్యం గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి.
హోరు గాలికి తోడు ఎదురుగా ఏటి హోరు. రాను రాను ఏటి వరద పెరుగుతోంది. హేమంత్‌ బేగులోని గొడుగు తీసి ఏటి దగ్గరకు బయలుదేరాడు. అక్కడకి ఏరు వంద మీటర్ల దూరం ఉంటుంది. కానీ విపరీతమైన గాలి వీస్తుండటంతో అతని గొడుగు ఎగిరిపోసాగింది. ఆ జడివాన, హోరు గాలిలో ఏటి ఒడ్డుకు చేరుకునే సరికి పూర్తిగా తడిసి పోయాడు. కానీ అక్కడ ప్రకతి దశ్యం చాలా అందంగా కనిపించసాగింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఏరు పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ పారుతుంది. కనుచూపు మేరంతా వర్షం. దూరంగా నల్లటి ఆకాశం, ఎర్రటి ఏరు కలిసే క్షితజ రేఖ సన్నగా కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడికి ఓ రైతు తాటి కమ్మ గొడుగుతో వచ్చాడు. అతని నోట్లో పెద్ద చుట్ట ధూమ శకటంలా పొగ వదులుతోంది.
నేను కొండపాలెం వెళ్ళాలి. పడవ వేస్తారా ఈ వర్షంలో? అనీ అతన్ని అడిగాడు హేమంత్‌.
అతను చుట్టను చేత్తో పట్టుకొని ఈ వర్షంలో పడవా? పెమాదం, నిన్నట్నుంచీ ఏటికి వరదొస్తోంది. పైన మొన్నట్నుంచి బాగా వర్సాలు పడుతున్నాయి. ఏటి వొరద తగ్గితే గాని అప్పన్న పడవ ఎయ్యడు అన్నాడతను.
అతని మాటలు అతనికి నిరుత్సాహం కలిగించాయి. తనేమో అర్జెంటుగా ఆ ఊరెళ్ళాలి. ఈ అడ్డరోడ్డుకి రోజూ ఒకటే బస్సు వస్తుంది. తిరిగి వెళ్ళిపోవాలన్న మళ్ళీ రాత్రి తొమ్మిది వరకూ బస్సు లేదు. అంతవరకూ ఈ వర్షంలో ఎక్కడ ఉండటం? పైగా ఇక్కడ ఏ ఊరూ లేదు.
బాబూ! ఇక్కడ ఏదైనా ఊరుందా? అనీ అడిగాడు ఆ రైతుని.
అదుగో ఆ సెట్లలో కనిపిత్తోందే అదే రాముడిపేట. ఇవతలి ఒడ్డునే ఉంది రెండు కిలోమీటర్లు నడవాలి అన్నాడు అతను.


ఇంతలో మళ్ళీ వర్షం ఉదతమైంది. ఈసారి గాలి మరింత వేగం పుంజుకుంది. చెట్లు ఊగిపోతునాయి. ఆకాశంలో ఉదయం పూట నక్షత్రాలు మెరుస్తూ కనిపించ సాగాయి. అతను మళ్ళీ వర్షంలో రావిచెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ పెరుగుతున్న వర్షాన్ని చూస్తుంటే అతనిలో నిస్పహ చోటుచేసుకో సాగింది. అయినా నిరాశను ఎప్పుడూ దరికి చేరనియ్యకూడదన్న మధుమిత మాటలు ఆ సమయంలో అతనికి గుర్తుకు వచ్చాయి.

.
మధుమిత గుర్తుకు రాగానే అతని కళ్ళు చెమర్చాయి. ఆమె ఎప్పుడూ చెప్పే Let the first rain wash away yesterdays worries and awaken new dreams అన్న మాట గుర్తుకొచ్చి మనసు కుదుటపడింది. ఎంతటి సమస్య వచ్చినా తొణకని మనస్తత్వం మధుమితది. ఇవాళ ఈ సమయంలో ఎందుకో మధుమిత పదేపదే గుర్తుకు రాసాగింది అతనికి. కొద్దిసేపటికి వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అతను గొడుగు వేసుకొని రాముడిపేట వైపు నడవటం మొదలు పెట్టాడు. మబ్బువల్ల వెలుతురు తగ్గిపోయి చీకటి ముసురుకుంటుంది.
రోడ్డు కిరువైపులా బురదనీరు వరదలా పారుతోంది. చుట్టూ నీరు ‘వాటర్‌ వాటర్‌ ఎవ్విరీ వేర్‌’ అన్నట్లు ఉంది. ఎదురుగా సముద్రంలా ఏరు పారుతోంది. ఆ సాయంసంధ్య అందానికి ఏటి హోరు సంగీతం అందిస్తున్నట్లున్నాది. ఇంతలో మళ్ళీ ఉరుములు, మెరుపులతో వర్షం. ఈసారి మరింత భారీగా మొదలైంది. హోరుగా వీచే గాలికి గొడుగు ఊగిపోతోంది.


హేమంత్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. ఊరు కిలోమీటరుకు పైగా దూరంలో ఉంది. ఈ భీకర వర్షంలో అక్కడ వరకూ వెళ్ళడం చాలా కష్టం. అతను ఆందోళనతో చుట్టూ చూసాడు. నిలబడటానికి చెట్టుకూడా లేదు. ఆ సమయంలో కొద్ది దూరంలో మిణుకు మిణుకు మంటూ ఒక వెలుగు కిరణం కనిపించ సాగింది. అతను అటువైపు దష్టి మరల్చాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతనికి ఒక ఇల్లు ఏటి ఒడ్డున కనిపించింది. ఊరికి దూరంగా ఏటి ఒడ్డున ఒంటరిగా కనిపిస్తున్న ఆ ఇంటిని చూడగానే అతనికి ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగించింది. వెంటనే అటువైపు నడవటం మొదలు పెట్టాడు. వర్షపు జల్లు ఎక్కువగా ఉండటంతో అతని అడుగులు వడివడిగా పడుతున్నాయి.


కొద్ది క్షణాల్లోనే అతను అక్కడికి చేరుకున్నాడు. దూరంగా కొండ, కొండపైన నల్లటి మేఘాలు, హోరున కురుస్తున్న వర్షం, ఎదురుగా భీకర హోరుతో ఏరు, ఏటి ఒడ్డున పర్ణశాలలా ఇల్లు. చాలా అందంగా అద్భుతంగా కేన్వాస్‌ మీద అప్పుడే వేసిన తడియారని చిత్రంలా కనిపిస్తోంది ఆ దశ్యం.
ఇంటి ముందర వెదురుతో చేసిన గేటు, చుట్టూరా ఫెన్సింగ్‌, గాలి ఎక్కువవడంతో అతను గేటు తీసుకొని లోనికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ బాగా నీరు చేరి పోయి ఉంది. ఇంటి ప్రాంగణం అంతా పూలమొక్కలతో, కూరగాయల పాదులతో పచ్చగా ఉంది. అతను వడివడిగా వెళ్ళి తలుపు కొట్టాడు. కొద్ది నిముషాలు అక్కడ వర్షపు హోరు తప్పా అలికిడి లేదు. మళ్ళీ తలుపు కొట్టబోతూ అలా కొట్టడం మంచిది కాదేమో అన్న సంశయం కలిగి ఆగిపోయాడు.
ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఓ ముప్పై ఏళ్ళ స్త్రీ నిలబడి ఉంది. తెల్లగా, అందమైన వర్ఛస్సు, పొడవైన జడ, ఆకు పచ్చటి చీరలో సౌందర్యం ఉట్టి పడుతూ ఆమె కనిపించింది.
ఆమెను చూస్తూనే ”మేడం! బయట బాగా వర్షం పడుతుంది. దగ్గర్లో ఏ యిల్లూ లేదు. ఊరు దూరంగా ఉంది. అక్కడికి వెళ్ళే సమయం లేదు. నేను లోనికి రావచ్చా” అన్నాడు గొడుగును ముడి చేస్తూ.
ఆమె కొద్దిసేపు అతని వైపు చూసి ముభావంగా ”రండి!” అంది లోనికి వెళుతూ. ఆమె ఆ మాట అంటూండగానే అతను లోనికి బేగుతో ప్రవేశించాడు. లోపల పెద్ద వరండా. గోడ పక్కనే వెదురుతో చేసిన సోఫా, కుర్చీలు, మధ్యలో టీపారు ఉన్నాయి. అతను పరుగున తన బేగుని కుర్చీ మీద పెట్టి అందులోని తువ్వాలుని తీసుకున్నాడు హేమంత్‌.


”ఆ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకోండి” అంది ఎదురుగా ఉన్న గదిని చూపిస్తూ.
వెంటనే అతను ”సారీ మేడమ్‌! బాగా తడిసిపోవడంతో ఏం చెయ్యాలో తోచలేదు” అంటూ ఆ గదిలోకి వెళ్ళాడు.
పది నిముషాల తరువాత హేమంత్‌ బట్టలు మార్చుకొని వరండాలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. వర్షం ఉధతంగా పడుతూనే ఉంది. ఇంత వర్షాన్ని హేమంత్‌ ఎప్పుడూ చూసి ఎరగడు. కొద్ది నిముషాల తరువాత ఆమె ట్రేలో టీ తీసుకు వచ్చింది. అప్పుడతను ఆమెను దగ్గరగా చూసాడు. ఇప్పుడతని ముఖంలో రంగులు మారసాగాయి. ఆమెని చూస్తుంటే అతనికి ఆశ్చర్యం కలుగుతోంది. చూడటానికి ఆమె మధుమితలా కనిపిస్తోంది. కనిపించటమేమిటి అచ్చు మధుమితలాగే ఉంది.
బుగ్గమీద పుట్టుమచ్చతో పాటు ఆ ముఖం, జడ, నడక, మాట అన్నీ మధుమితని గుర్తుకు తెస్తున్నాయి. ఆ సమయంలో అతని మస్తిష్కం నిండా ఎన్నో ఆలోచనలు. ఈమె మధుమితేనా?! అయినా మధుమిత ఇంత వెనకబడిన ప్రాంతంలో అదీ ఈ ఏటి ఒడ్డున పర్ణశాలలో ఎందుకుంటుంది?! ఇది తన భ్రమా?! నిజమా!? అతని మస్తిష్కం ఆలోచనలతో వేడెక్కిపోతోంది.


కానీ అవేవీ బయటపడకుండా అతను టీ కప్పు అందుకొని ”థ్యాంక్స్‌ మేడం! ఈ వర్షంలో మీరు చేసిన సహాయానికి కతజ్ఞతలు” అన్నాడు.
”ఇంతకీ ఈ వర్షంలో ఇక్కడికి దేనికొచ్చారు?” అని అడిగింది ఆమె.
”నేను ఏటవతల కొండపాలెం వెళ్ళాలి. కానీ ఇక్కడికొచ్చేసరికి భీకరమైన వర్షం, ఏటికి వరద వల్ల పడవ వెళ్ళదనీ తెలిసింది. ఏం చెయ్యాలో తోచక రాముడిపేట ఊళ్ళోకి వెళుతుంటే ఒంటరిగా పర్ణశాలలో ఉన్న మీ ఇల్లు కనిపించింది” అన్నాడు టీ తాగుతూ.
”అయినా మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఈ కొండ ప్రాంతంలో వర్షాలెక్కువ. అదీకాక బంగాళాఖాతంలో వాయుగుండం అనీ టీవీలో చెబుతున్నారు. అన్నీ తెలిసి ఆ ఊరు ప్రయాణం ఇప్పుడెందుకు పెట్టుకున్నారు? వర్షాకాలం వచ్చిందంటే ఈ ఏట్లో రెండు నెలలు పడవ వెయ్యరు” అనీ చెప్పింది ఆమె.
”మేడం! మీరేంటి ఊరికి దూరంగా ఈ ఏటి ఒడ్డున వంటరిగా ఉంటునారు? మీకు భయం వెయ్యదా?” అడిగాడు హేమంత్‌.
”నా పేరు మధుమిత! నేను రాముడిపేట ప్రాథమిక పాఠశాలలో టీచర్ని. నాకెందుకో వంటరిగా ఉండటం ఇష్టం. అందుకే ఈ ఏటి ఒడ్డున ఇల్లు నచ్చింది. ఇక భయమంటారా? ఇంతకన్నా భయంకరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి నా జీవితంలో. వాటినే ఎదుర్కొన్న నాకు ఇక్కడ వంటరిగా ఉండటం ఓ పెద్ద సమస్య కాదు” అంది ఆమె.
ఆమె మాటలకు హేమంత్‌ మస్తిష్కం మొద్దుబారిపోయింది.


”మధురిమా! నిన్ను చూడగానే పోల్చాను. కానీ ఈ కొండ ప్రాంతంలో ఈ ఏటి ఒడ్డున ఎందుకుంటావన్న ఆలోచన నన్ను అనుమానంలో పడేసింది. ఏదైనా ఇన్నేళ్ళ తరువాత నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. మరో విధంగా బాధగా కూడా ఉంది. అన్నీ కలిసొచ్చివుంటే మనం భార్యాభర్తలుగా కలసి హాయిగా ఉండేవాళ్ళం. కానీ విధి వక్రీకరించి ఇలా విడివిడిగా బతుకుతున్నాం. ప్రేమ కథలన్నీ చివరకు విషాదం అవక తప్పదన్న విషయం మన విషయంలో కూడా నిజం అయింది” అన్నాడు చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ.
”హేమంత్‌! అందరి మగాళ్ళలాగే నువ్వు కూడా నన్ను ప్రేమించినట్లు నటించి మోసం చేసావు. అయినా స్త్రీలు మగాళ్ళ చేతిలో మోసపోవడం అన్నది అనాదిగా వస్తున్నదే. తప్పు నువ్వు చేసి విధిని ఎందుకంటావు? ఏరు దాటే వరకే తెప్ప అవసరం. దాటిన తరువాత అది ఏమైపోతే మనకెందుకు అన్న నీ మనస్తత్వాన్ని నేను పసిగట్టలేక పోయాను. ఆ విషయంలో నేను తప్పు చేసి జీవితంలో భారీ మూల్యం చెల్లించుకున్నాను” అంది మధుమిత.
ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతులో విషాదం పలికింది.


”మధూ! నిన్ను పెళ్ళి చేసుకోవాలని నేను ఎంతో ప్రయత్నించాను. చివరకు మా అమ్మ నాన్నలతో విడిపోవడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ మా మేనమావ కూతురు అంజలి ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యడంతో తప్పక ఆమెను పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. నేను తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. కానీ నిన్ను నమ్మించలేను. ఏదైనా నావల్ల నువ్వు మోసపోయావు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు ఎంతో బాధ వేస్తుంది. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత నాది” అన్నాడు హేమంత్‌.
”తప్పు ఇంద్రుడిదైనా అహల్యను శిక్షించే సమాజం మనది. అరటి ఆకుల్ని భోజనానికి వాడుకొని తరువాత దాన్ని విసిరేసినట్లు స్త్రీని కూడా మగవాళ్ళు అలాగే వాడుకుంటారు. వర్షం అనీ లోనికి రానిచ్చాను కానీ లేకపోతే జీవితంలో నీ ముఖం చూడకూడదనుకున్నాను” అంది కోపంగా.
”మధూ! క్షమయా ధరిత్రి అనీ స్త్రీలను ఎందుకున్నారో నిన్ను చూసిన తరువాత తెలిసింది. అయినా నా వల్ల నీకు తీరని ద్రోహం జరిగింది. ఇప్పుడు దాన్ని దిద్దుకోలేను. నా చెయ్యి దాటిపోయింది. క్షమించమనీ అడగటం తప్ప నేనేమీ చెయ్యలేను” అన్నాడు హేమంత్‌.


”క్షమించమని అడగటం చాలా తేలిక. మగవాళ్ళకు మరుపు దేవుడిచ్చిన వరం. అందుకే నువ్వు హాయిగా పెళ్ళి చేసుకున్నావు. కానీ నీ వల్ల నేను ప్రతీక్షణం నరకం అనుభవిస్తున్నాను. లోకం కాకి లాంటిది. అది మగవాళ్ళని ఏమీ అనదు. స్త్రీలను వెంటాడి వేటాడి మరీ పొడుచుకు తింటుంది. తప్పు ఇద్దరూ చేసినా కేవలం స్త్రీని మాత్రమే ప్రశ్నించే సమాజంలో మనం బ్రతకడం విషాదం. ఇప్పడివన్నీ ఎందుకు కానీ వర్షం తగ్గగానే వెళ్ళిపో” అంది మధుమిత.
మధూ! పడవ వేస్తారో లేదో తెలియదు. రాత్రి గడిస్తే రేపు ఉదయం పడవ వేస్తారు. అప్పుడు వెళ్ళిపోతాను. ఈ రాత్రికి ఇక్కడ ఉండే అవకాశం ఇవ్వు అన్నాడు హేమంత్‌.
”నాకిష్టం లేదు హేమంత్‌! నా జీవితంలో నీ పాత్ర ముగిసింది. దాన్ని కొనసాగించడం నాకిష్టం లేదు. నన్ను దయచేసి ఒప్పించాలనీ ప్రయత్నించకు” అంది అతనికి రెండు చేతులతో దండం పెడుతూ.
”మధూ! ఇప్పుడు నేనేది చెప్పినా వినే పరిస్థితిలో నువ్వు లేవు. నేను ఏటి వైపు వెళ్ళి ఏటి వరద ఎలా ఉందో చూసి వస్తాను. ఒకవేళ పడవ వేస్తే వెళ్ళిపోతాను. లేకపోతే ఇక్కడ ఉండక తప్పదు. దయచేసి నన్ను అర్థం చేసుకో” అంటూ అతను ఏటివైపు వెళ్ళాడు.
గంట తరువాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి చీకటి బాగా పడింది. దూరంగా కీచురాళ్ళ చప్పుళ్ళు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఇంకో పక్క ఏటి వరద హోరు భీతి గొలుపుతోంది. అతన్ని చూసి మధుమిత బయటకు వచ్చింది.
”మధూ! ఏటి వరద తగ్గేలా లేదు. ఈ రాత్రి వర్షం తగ్గితే రేపుదయం పడవ వేస్తాననీ పడవ వాడు చెప్పాడు. ఈ రాత్రికి నేను ఎక్కడికీ వెళ్ళలేను. నా పరిస్థితి దయచేసి అర్థం చేసుకో” అన్నాడు హేమంత్‌.
ఇంతలో ఒకమ్మాయి రెండు కుర్చీలను తెచ్చి బయట పూలమొక్కల మధ్య వేసింది. హేమంత్‌ ఆ కుర్చీలో కూర్చుంటూ మధూ! ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? ఎలా ఉంది జీవితం? అనీ అడిగాడు.


మధుమిత దూరంగా రెండో కుర్చీని లాక్కొని అందులో కూర్చుంది. కొద్ది సేపు అక్కడ నిశ్శబ్దం.
”బాణం దెబ్బ తగిలిన పక్షిని నేను. అది లేచి ఎగరటానికి సమయం పడుతుంది” అంది మధుమిత.
”మన పెళ్ళి విషయం చెప్పడానికి కోటి ఆశలతో మా ఊరు వెళ్ళిన నాకు అనుకోని ఎదురు దెబ్బ మా మామ కూతురు అంజలి ఆత్మహత్యా ప్రయత్నం వల్ల తగిలింది. ఇంక తప్పక ఆమెను పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. పెళ్ళైన రెండేళ్ళకు మాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నేను నీకు చేసిన ద్రోహం వల్లో ఏమో వాడు పోలియోతో పుట్టాడు. రెండు కాళ్ళు చచ్చుబడిపోయి మంచానికే పరిమితం అయ్యాడు. మెలో డ్రామా అన్నది ఎక్కడో ఉండదు, మన జీవితాల్లోనే ఉంటుంది. నా చేత మోసగించబడ్డానన్న దుఃఖంతో నువ్వు, పెళ్ళి చేసుకున్నా పోలియో కొడుక్కి తండ్రినై నేనూ ఇద్దరం బాధపడుతున్నాం. అదే జీవన వైచిత్రి” అన్నాడు హేమంత్‌.
ఇంతలో ఇందాక వచ్చిన అమ్మాయి ఇద్దరికీ టీలు పట్టుకొనీ వచ్చింది.
”హేమంత్‌! జీవితంలో ఎన్నో ఊహించుకున్న నాకు నీ మోసం కోలుకోలేని దెబ్బ తీసింది. నా తండ్రి బెంగతో అనారోగ్యం పాలై మంచం పట్టి సంవత్సరం తరువాత చనిపోయారు. మా చుట్టాలు, మా ఊరివాళ్ళు మా కుటుంబాన్ని వెలివేసారు. దాన్నుంచి కోలుకోవడానికి నాకు రెండు సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత నాకు ఈ టీచరు ఉద్యోగం వచ్చింది. ఒకసారి వంచింపబడ్డ నాకు పెళ్ళంటే అయిష్టత ఏర్పడింది. అందుకే పెళ్ళి చేసుకోకూడదనీ నిర్ణయించుకున్నాను” అని చెప్పింది మధుమిత .


”మరి ఈ వంటరి బతుకు కష్టం కాదా? ఎన్నాళ్ళిలా? జీవితం చాలా విలువైనదంటారు? చీకటిని తిడుతూ కూర్చునే కన్నా చిన్న చిరు దివ్వెని వెలిగిస్తే తేజోమయం అయి దారి కనిపిస్తుంది కదా” అన్నాడు హేమంత్‌!
”అమ్మ కడుపులో వంటరిగా ప్రాణం పోసుకొని, వంటరిగా ఈ భూమ్మీదకు వచ్చి, వంటరిగానే వెళ్ళిపోయే మనం వంటరిగా బతకలేమా చెప్పు? నాకు తోడుగా మా అమ్మ, పనమ్మాయి ఉన్నారు. కళ్ళు మూసుకునే లోపల జీవితం ముగిసి పోతుంది. అందరం ఎప్పుడో అపుడు వెళ్ళిపోక తప్పదు” అంది ఆమె వేదాంత ధోరణిలో మాట్లాడుతూ.
”మధూ! జీవితంలో మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు. కానీ విధి చాలా గొప్పది. నిన్ను చూసే అవకాశం కలిగించింది. ఇన్నాళ్ళూ నువ్వెక్కడో హాయిగా ఉన్నావన్న ఆనందంతో బతికాను. కానీ రేపట్నుంచీ నిన్ను తలచుకొనీ బాధపడుతూ బతకాలి” అన్నాడు చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ.
అప్పటికి సమయం ఎనిమిదైంది. పనమ్మాయి అతనికి రొట్టెలు తెచ్చి ఇచ్చింది.
వెంటనే మధు లేచి నిలబడి హేమంత్‌! ఈ రాత్రి వరండాలో పడుకో. తెల్లవారగానే వెళ్ళిపోవాలి. జీవితంలో ఇదే మన ఆఖరి కలయిక కావాలి. నిన్ను చూడటం నాకిష్టం లేదు. జీవితంలో మనం సమాంతర రేఖల లాంటి వాళ్ళం. అవి కలవవు జీవితంలో మనం అనుకున్నవేవీ జరగవు. అయినా మనుగడ సాగించక తప్పదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మధుమిత.
—-


ప్రభాత సమయం. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది
హేమంత్‌ లేచి ఏటివైపు వెళ్ళి కాలకత్యాలు తీర్చుకున్నాడు. అప్పటికే అక్కడికి పడవ వాడు వచ్చాడు. హేమంత్‌ అతనితో పది నిముషాల్లో వస్తాననీ చెప్పి ఇంటికి వచ్చాడు.
మధుమిత వరండాలో నిల్చుని అతని కోసం ఎదురు చూస్తోంది.
”వస్తాను మధూ! బహుశా మనం ఇక కలవక పోవచ్చు. ఏదైనా జరిగితే మళ్ళీ జీవన సంధ్యా సమయంలో కలుద్దాం. ఏదైనా నువ్వు రాత్రి చేసిన సహాయానికి కతజ్ఞతలు” అనీ లేచాడు.
ఇంతలో పనమ్మాయి టీ తెచ్చి అతని కిచ్చింది.
ఇంతలో మూడేళ్ళ అబ్బాయి పరుగున మధుమతి దగ్గరికి వచ్చాడు. ఆ అబ్బాయి చూడటానికి తెల్లగా, బొద్దుగా, అందంగా ముద్దొస్తూ ఉన్నాడు.
”అమ్మా! ఈరోజు స్కూలు శలవేనా? స్కూలుకి వెళ్ళక్కర్లేదా?” అని అడిగాడు మధుని .
ఆమె వాడి నెత్తుకొని ముద్దు పెడుతూ ”వర్షం తగ్గిపోయింది వంశీ. నిన్నంటే వర్షం కాబట్టి స్కూలు లేదు. ఇవాళ వెళ్ళాలి. పద రెడి అవుదువుగాని” అనీ వాడిని కిందకు దించుతూ చెప్పింది. వాడు వెంటనే పరిగెడుతూ లోనికి వెళ్ళిపోయాడు.
ఆ అబ్బాయిని చూడగానే హేమంత్‌ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. మధుమిత పెళ్ళి చేసుకోలేదని చెప్పింది. మరి అమ్మా అంటూ వచ్చిన ఆ పిల్లడు? అతనికి అర్థం కావటం లేదు.


అందుకే ఆశ్చర్యంతో ఆమెవైపు చూసాడు. ఆమెకు అతని ముఖంలో భావం అర్థం అయింది.
”మనం వయసులో ఉన్నప్పుడు ఓ వర్షం రాత్రి నువ్వు నా గదికి వచ్చినపుడు పడ్డ తొందర ఫలితంగా నేను గర్భం ధరించాను. ఎలాగూ పెళ్ళి చేసుకుంటావనీ అప్పుడు అనుకున్నాను. కానీ నువ్వు నన్ను మోసం చేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయావు. నాన్న గారు ఎబార్షన్‌ చేసుకోమని చెప్పారు, కానీ నేను చేసిన తప్పుకి లోపల పెరుగుతున్న శిశువు ఎందుకు శిక్ష అనుభవించాలనీ దానికి నేను ఒప్పుకోలేదు. హేమంత్‌! దయచేసి త్వరగా వెళ్ళిపో. ఇంకెప్పుడూ నన్ను కలవడానికి ప్రయత్నించకు. నీ ముఖం చూడటం కూడా నాకిష్టం లేదు. నా జీవితంలో ఆ రెండేళ్ళు ఓ పీడకల. దాన్ని నేను ఎప్పుడో మరిచిపోయాను. ఇప్పుడు వంశీయే నా జీవితం. వాణ్ణి నీలా కాకుండా మంచి మనిషిగా పెంచుతాను. నీ నీడ కూడా వాడి మీద పడటం నాకిష్టం లేదు. వెళ్ళిపో అంటూ ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకుంది.
హేమంత్‌ ఆమె మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అతని మస్తిష్కం మొద్దుబారిపో సాగింది. కొద్ది క్షణాలు అక్కడే నిలబడి ఆ తరువాత బేగు పట్టుకొని ఏటివైపు నడవటం మొదలు పెట్టాడు.
కొద్ది దూరం వెళ్ళగానే ఏట్లో పడవ, దాని తెరచాప కనిపించసాగాయి. హేమంత్‌ వడివడిగా ఏటి గట్టు వైపు అడుగులు వెయ్య సాగాడు.
– గన్నవరపు నరసింహ మూర్తి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -