ప్రేక్షకులకు కృతజ్ఞతలు

దిల్‌ రాజు సారథ్యంలో శిరీష్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. ఈనెల 3న విడుదలైన చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను పొందుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్‌ గురించి దర్శకుడు వేణు ఎల్దండి మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘నేను 20 ఏళ్లుగా నటిస్తున్నాను. మంచి కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదు. ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే రాయటం మొదలు పెట్టాను. కొన్ని సినిమాలకు రాశాను. అయితే కథలు రాసే విషయంలో రొటీన్‌కి భిన్నంగా వెళ్లాలనిపించింది. తెలంగాణ కల్చర్‌లో చేదు నోరు అనేది ఉంది. మా నాన్న చనిపోయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ వచ్చారు. అక్కడ ఏడుపులు, తాగడాలు, తినడాలు అన్నీ చూస్తే నాకు కొత్తగా కనిపించింది. అవన్నీ నా మైండ్‌లో నాటుకు పోయాయి. వీటిని బేస్‌ చేసుకుని రాసిన కథని విని శివరాం మాట్లాడుతూ ఇది చాలా పెద్ద కథ. పెద్ద వ్యక్తి చేతిలో ఉంటే మరో లెవల్‌కు రీచ్‌ అవుతుందన్నారు. ఆయన దిల్‌ రాజు దగ్గరకు తీసుకొచ్చారు. ఆయనకు కూడా కథ నచ్చడంతో ఈరోజు సినిమా ఇలా మీ ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. సినిమా రిలీజైన తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నుంచి వచ్చిన అప్రిషియేషన్స్‌ మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్‌. ఇకపై నేను చేయబోతున్న సినిమాల్లో వినోదం ఉంటుంది. ఇప్పటికే దిల్‌ రాజుకి రెడీ ఓలైన్‌ చెప్పాను. ఇది కాస్త పెద్ద స్పాన్‌లోనే ఉంటుంది’ అని చెప్పారు.

Spread the love