Wednesday, August 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజలకు మోడీ, అమిత్‌‌షా క్షమాపణ చెప్పాలి

ప్రజలకు మోడీ, అమిత్‌‌షా క్షమాపణ చెప్పాలి

- Advertisement -
  • సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
  • విద్యా, వైద్యరంగాలను ప్రజలకు ఉచితంగా అందించాలి : రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
  • నవతెలంగాణ-హైదరాబాద్: సీజేపీ, ఇతర యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన చలో పార్లమెంట్‌ ‌సందర్భంగా జెన్‌‌జీపై లాఠీలు ఝులిపించడం, పిల్లెట్లను ప్రయోగించడం దారుణమనీ, ఈ విషయంలో యువతకు, దేశ ప్రజలకు ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌‌షా క్షమాపణలు చెప్పాలని సీపీఐ(ఎం) పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు డిమాండ్‌ ‌చేశారు. బుధవారం హైదరాబాద్‌‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతితో కలిసి రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల మీద చర్చించేందుకు కాకుండా ప్రతిపక్ష పార్టీల ఎంపీలను చీల్చి గత సమావేశాల్లో వీగిపోయిన బిల్లులను ఆమోదించుకోవడానికి పార్లమెంట్‌ ‌సమావేశాలు పెట్టినట్టు ఉందని విమర్శించారు. చలో పార్లమెంట్‌ ‌సందర్భంగా జరిగిన ఘటనలపైనా, విద్యార్థులపై జరిగిన దాడులపైనా కనీసం చర్చించేందుకు అధికార ఎన్‌‌డీఏ కూటమి ముందుకు రాకపోవడం దారుణమని విమర్శించారు.
  • విద్యార్థులపై దాడులకు పాల్పడింది ఎవరు? పెల్లెట్లు ప్రయోగించాల్సిన అవసరమేమి వచ్చింది? ఆ ఘటనకు ఆదేశాలు జారీ చేసిందెవరు? అనే దానిపై చర్చే లేదన్నారు. పార్లమెంట్‌ ‌సమావేశాలకు రాకుండా అమిత్‌‌షా మొహం చాటేయడాన్ని తప్పుబట్టారు. జెన్‌‌జీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను క్షమిస్తున్నామని ప్రధాని మోడీ ప్రకటన చేయడం అంటే విద్యార్థుల పోరాటాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు.
  • డీలిమిటేషన్ మహిళా బిల్లును కలిపి పెట్టినందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయన్నారు. కేవలం మహిళా బిల్లునే విడిగా ప్రవేశపెట్టేందుకు ముందుకు వస్తే అన్ని పక్షాలు మద్దతు తెలుపుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు పదో తేదీన తలపెట్టిన జైల్‌‌భరోకు మద్దతిస్తున్నామనీ, ఆ నిరసనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
  • బీహార్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు బీజేపీకి చెంపపెట్టు అన్నారు. దేశంలోని యువతరం బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నదనీ, మతం, రాముని పేరుతో రాజకీయాలు ఎల్లకాలం సాగవని తెలిపారు. జెన్‌‌జీ పోరాటం రాజకీయంగా వినూత్న మార్పునకు సంకేతమనీ, ఇది లౌకిక శక్తులకు పెద్ద ఊరట అని కొనియాడారు. ప్రధాని మోడీ మెప్పు కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలపించినట్టు ఉందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల 20 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడ్డప్పుడు ఎందుకు ఏడుపు రాలేదని ప్రశ్నించారు.

విద్యా, వైద్య రంగాల పరిరక్షణ, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు : జాన్‌‌వెస్లీ
ప్రజలకు విద్యావైద్యాన్ని ఉచితంగా అందించేలా పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటాలు చేస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ తెలిపారు. విద్యావైద్య రంగాలను పరిరక్షించడంలో భాగంగా వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 85 శాతం మంది పిల్లలను తల్లిదండ్రులు ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తున్నారనీ, కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడమే కారణమని తెలిపారు. తక్కువలో తక్కువగా ఏటా ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రులు రూ.50 వేల వరకు ఖర్చుపెట్టాల్సి రావడం భారంగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ ‌చేశారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా, టీచర్లను నియమించకుండా నియోజకవర్గానికి ఒకటో, రెండో స్కూళ్లను పెడతామని చెప్పడమంటే ప్రభుత్వ విద్యావ్యవస్థను నీరుగార్చడమేనని విమర్శించారు. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. 20 వేల కానిస్టేబుల్‌ ‌పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల స్థలాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చేదాకా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ, లేకపోతే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికే నష్టమని హెచ్చరించారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులను, వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఎనిమిది లక్షల ఎకరాలకు పోడు హక్కు పత్రాలివ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -