నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ లోని పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆధ్వర్యంలో తలసానిని సన్మానించి గణపతి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో నే అతిపెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 69 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. 11 రోజుల పాటు పూజలు అందుకునే అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పారు. ప్రజలందరిపై ఆ గణనాధుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలి ఆకాంక్షించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు.



