నవతెలంగాణ – ఆర్మూర్
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఒక కార్మికుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఆండ్రాసి మల్లయ్య మంగళవారం సాయంత్రం మస్కట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు.
మల్లయ్య రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం విదేశానికి వెళ్లిన యజమాని తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మల్లయ్య మరణవార్త విన్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మృతదేహాన్ని మస్కట్ నుండి తమ స్వగ్రామమైన ఆలూర్కు వీలైనంత త్వరగా చేర్చేలా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు. మృతదేహం తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేసి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.



