అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, రైతు సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు గతేడాది అక్టోబర్ 31న హత్యకు గురయ్యారనీ, ఇది ఇప్పటి వరకు మిస్టరీగా ఉందని సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ హత్య గురించి వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ వారం అసెంబ్లీలో జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ సామినేని రామారావు ఆయన స్వగ్రామానికి రెండు సార్లు సర్పంచ్గా పని చేశారని గుర్తు చేశారు. తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ గ్రామంలో సీపీఐ(ఎం) విజయం సాధించిం దని వివరించారు.
సామినేని రామారావు ఎంతో సౌమ్యుడనీ, కమ్యూనిస్టు పార్టీకి ఎంతో నిబద్ధతతో పని చేశారని చెప్పారు. అక్టోబర్లో హత్య జరిగినా ఇప్పటి వరకు ఎటువంటి వాస్తవాలు బయటకు రాలేదని అన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నా అందులో పురోగతి లేదని చెప్పారు. కుటుంబ సభ్యులకు లై డిటెక్టర్ పరీక్ష చేశారని వివరించారు. పోలీసులు మళ్లీ చేస్తామంటున్నారని చెప్పారు. సామినేని రామారావుకు ఎవరితోనూ ఎటువంటి ఘర్షణలు లేవని అన్నారు. ఆయన్ను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారనే వాస్తవాలు తేలాల్సి ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రామారావు హత్య మిస్టరీలో వాస్తవాలు బయటకు తీయాలని కోరారు. ఈ విషయంలో వామపక్ష పార్టీలు నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలుద్దామని అనుకున్నారని చెప్పారు. అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తెస్తున్నానని అన్నారు.



