మనకు జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటారు. పోతుంటారు. సంతోషం వచ్చినప్పుడు పొంగి పోకూడదు. అలాగని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఆహ్వానించాలి. చిరునవ్వుతోనే వీడ్కోలు చెప్పాలి. ఈ జీవితమంతా నవ్వులతోనే విరియాలి. సాగాలి అనే సందేశంతో పి.ఎస్.నారాయణ ఓ పాట రాశాడు. 2024 లో పి.ఎస్.నారాయణ దర్శకత్వంలోనే వచ్చిన ‘జ్యూయల్ థీఫ్’ సినిమాలోని పాట అది. ఆ పాటనిపుడు చూద్దాం.
పి.ఎస్.నారాయణ ఈ సినిమాకు దర్శకుడు. అద్భుతమైన గీతరచయిత కూడా. సరళమైన పదాల్లో గొప్ప సందేశాన్నిచ్చాడు. ఈ పాట వింటూ ఉంటే బాధలో ఉన్న వారికందరికీ ఎంతో ఊరట లభిస్తుంది. జీవితం విలువేంటో తెలుస్తుంది.
సినిమా సన్నివేశపరంగా చూసినట్లయితే.. ప్రమాదవశాత్తు రెండు కాళ్ళు, చేతులు పోయి, నోరు పడిపోయి కదలలలేని పరిస్థితిలో ఉన్న తండ్రికి కొడుకు సేవలు చేస్తూ తోడుగా నీడగా ఉంటాడు. తండ్రికి మనోధైర్యాన్ని కలిగిస్తూ ఈ పాటను పాడుతుంటాడు. తండ్రి చెప్పలేని బాధతో ఏడుస్తూ ఉంటాడు. తండ్రి మనసులో సంతోషాన్ని, ముఖంపై చిరునవ్వులను పూయించడానికి ఈ పాటను పాడుతాడు. ఇదీ సందర్భం..
మన జీవితం నవ్వుతూ సాగాలి. కష్టాలు ఎన్ని వచ్చినా నవ్వును మాత్రం వదలకూడదు. చిరునవ్వుతో మన జీవిత ప్రయాణం సాగాలి. మనలో లోపాలు ఎన్ని ఉన్నా, చుట్టూ ఊహించని సమస్యలు ఎన్ని వచ్చినా, బతుకు భరించలేనంత భారంగా ఉన్నా నవ్వుతూ మన జీవితం సాగుతూ ఉండాలి. కన్నీటికి తావు ఇవ్వకూడదంటున్నాడు.
వాళ్ళ తండ్రి నడవడానికి కాళ్ళు లేవని బాధపడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానని కుమిలిపోతుంటాడు. ఆ విషయాన్నే స్ఫురించేలా ఇక్కడ సందేశమిస్తున్నాడు. కాలానికి కాళ్ళు ఉండవు. అది మనకు కనబడదు. అయినా అది పరుగెడుతూ ఉంటుంది. చూస్తుండగానే వేగంగా సమయం గడిచిపోతుంటుంది. మనసుకు కాళ్ళు ఉండవు. నివాసమంటూ ఉండదు. అయినా అది లోకాలు దాటి వెళుతుంది. ఎక్కడెక్కడో సంచరిస్తుంటుంది. ఉన్నచోటే ఉంటూ ఎన్నెన్నో చోట్ల విహరిస్తుంటుంది. ఊహకందని ప్రాణం మన ఉసురుని నిలుపుతూ ఉంటుంది. ఈ సత్యం మనం తెలుసుకుంటే జీవితం ధన్యమవుతుంది. అని చెబుతున్నాడు. మనం ఆత్మస్థైర్యం కోల్పోయిన వేళ మన చుట్టూ ఉన్న ప్రకృతిని గురువుగా భావించాలని, ఆదర్శంగా తీసుకోవాలని ఈ చరణంలో చెప్పబడింది.
మొదటి చరణంలో కాళ్ళు లేకున్నా ప్రయాణించే కాలాన్ని, మనసుని, ప్రాణాన్ని గురించి చెప్పాడు. ఇక రెండవ చరణంలో కాళ్ళు, చేతులు లేకున్నా, మాట్లాడే నోరు లేకున్నా మన మధ్యనే ఉండి, మనకు తోడ్పడే వాటి గురించి చెబుతున్నాడు. చెట్లు కదలవు. అయినా అవి మన మధ్యనే ఉండి మనకు నీడనిస్తాయి. చల్లని గాలినిస్తాయి. తీయని పండ్లనిస్తాయి. వాటిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలన్నదే ఇక్కడ కవి సందేశం.
ఎన్నో మూగజీవాలు మన చెంతనే తిరుగుతూ ఉంటాయి. అవి మాట్లాడలేకున్నప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతూ, ఆడుతూ పాడుతూ ఉంటాయి. కిలకిల నవ్వుతూ మనకు వినోదాన్నిస్తుంటాయి. వాటిని చూసి మనం ఆనందించాలి. జీవితం విలువ తెలుసుకోవాలి. పువ్వు రాలిపోయే స్థితిలో ఉన్నా తిరిగి వికసిస్తుంది. మళ్ళీ సువాసనలను వెదజల్లుతుంది. పరిస్థితి ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. సమస్యలెప్పుడూ మనలనే అంటిపెట్టుకుని ఉండవు. వస్తుంటారు. పోతుంటారు. వాటి గురించి ఆలోచించకూడదు. వాటిని అసలే లెక్కించకూడదని చెబుతున్నాడు. ఈ పరమార్థం అర్థమైతే అంతా ఆనందంగానే ఉంటుంది. జీవితం పరిపూర్ణమవుతుందని అంటున్నాడు.
బాధల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే పాట ఇది. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం, మల్లికార్జున్ గానం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణాలు.
పాట:
నవ్వుతూ సాగాలి మన జీవితం/ చిరునవ్వుతూ సాగాలి మన గమనం/ లోపాలు మనలో ఎన్నున్నా/ బ్రతుకు మనకెంత భారమైనా/ నవ్వుతూ సాగాలి మన జీవితం/ చిరునవ్వుతూ సాగాలి మన గమనం/ కాళ్ళులేని కాలం పరుగులు పెడుతుంది/ ఉనికిలేని మనసు లోకాలు చుడుతుంది/ ఊహకందని ప్రాణం ఉసురుని నిలుపుతుంది/ అర్థమైతే చాలు బ్రతుకు ధన్యమవుతుంది/ కదలలేని వక్షాలు మన ముందులేవా/ మాటరాని జీవాలు మన చెంతలేవా/ రాలిపోయే పువ్వు కూడా వికసించలేదా/ అర్థమైతే చాలంతా ఆనందమేగా..
– డా||తిరునగరి శరత్చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682