డిపాజిట్ రద్దు, నూతన కిట్ల కోసం నిర్వాహకుల డిమాండ్
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే లక్ష్మీనారాయణ
నవతెలంగాణ – కంఠేశ్వర్ : కొత్త మండలాల్లో ఆధార్ సేవలు నిలిపివేతపై డిపాజిట్ రద్దు, నూతన కిట్ల కోసం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే లక్ష్మీనారాయణ నిర్వాహకుల తరఫున డిమాండ్ చేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఆధార్ సేవలు గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టి జి టి ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎస్ డి-మీసేవ ద్వారా టి జి టి ఎస్ ను ఆధార్ సేవా ప్రదాత (ఏఎస్పి) గా నియమించగా, ఇకపై శాశ్వత నమోదు కేంద్రాల (పి ఈ సి ఎస్) నిర్వహణ బాధ్యతను టీజీటీఎస్ స్వీకరించనుంది. టి జి టి ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, ప్రస్తుతం సేవలందిస్తున్న పిఇసి ఆపరేటర్లు ఇన్-హౌస్ మోడల్” కింద పనిచేయడానికి అంగీకరిస్తూ, అండర్టేకింగ్ లేఖతో పాటు ₹2,00,000 డిమాండ్ డ్రాఫ్ట్ను భద్రతా డిపాజిట్గా “ద కమిషనర్, ఈ ఎస్ డి (మీసేవ), హైదరాబాద్” పేరిట టీజీటీఎస్ కార్యాలయానికి సమర్పించాలి. ఈ ప్రక్రియను జూన్ 10, 2025 నాటి లేఖ తేదీ నుండి 10 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గడువులోగా అండర్టేకింగ్ సమర్పించని లేదా డిపాజిట్ చేయని పక్షంలో పిఇసి సేవా బాధ్యతలు రద్దు అవుతాయని టి జి టి ఎస్ స్పష్టం చేసింది.
అయితే, నూతన మండలాల్లోని మీసేవ నిర్వాహకులు ఈ డిపాజిట్ విధానంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన ఆధార్ కేంద్రాల ఏర్పాటు కోసం తాము ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చించి ల్యాప్టాప్లు, ఐరిష్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు వంటి పరికరాలను కొనుగోలు చేశామని, కొత్త గదులను కూడా ఏర్పాటు చేసుకున్నామని వారు వెల్లడించారు. రెండు సంవత్సరాలుగా ఆధార్ సేవలు నిలిచిపోయిన తమ మండలాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, డిపాజిట్ లేకుండానే కొత్త కిట్లను అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి ఎంతగానో సహాయపడుతుందని వారు పేర్కొంటున్నారు.
ఈ సమస్యను ఈ ఎస్ డి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి, అలాగే తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ (ఈఎంఓఏ) రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త కిరణ్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే లక్ష్మీనారాయణ, టీఎంఓఏ రాష్ట్ర కమిటీ… తరపున సమస్యను పరిష్కరించాలని మీసేవ నిర్వాహకులు కమిషనర్ ని కోరుతున్నామన్నారు.