Saturday, January 3, 2026
E-PAPER
Homeక్రైమ్లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం. రమేశ్, ఓ కేసు నుంచి పేరు తొలగించేందుకు లంచం డిమాండ్ చేసి, శుక్రవారం అరెస్టయ్యాడు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసు నుంచి తన పేరును తొలగించాలని ఓ వ్యక్తి ఎస్సై రమేశ్‌ను ఆశ్రయించాడు. ఇందుకుగానూ ఎస్సై రూ. 30,000 లంచం డిమాండ్ చేశాడు. ఒప్పందంలో భాగంగా, 2025 డిసెంబర్ 17న బాధితుడి నుంచి తొలి విడతగా రూ. 5,000 తీసుకున్నాడు. మిగిలిన రూ. 20,000 ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు, పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. శుక్రవారం కొల్లూరు పోలీస్ స్టేషన్‌లోని తన ఛాంబర్‌లోనే బాధితుడి నుంచి ఎస్సై రమేశ్ రూ. 20,000 లంచం తీసుకుంటుండగా, అధికారులు వల పన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఎస్సై రమేశ్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏసీబీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే, తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు గానీ, వాట్సాప్ (9440446106) ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -