నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని బల్దియాలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్పేట సర్కిల్లో పనిచేస్తున్న మనీషా అనే మహిళా అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే, జీహెచ్ఎంసీ వార్డ్ నెం-2, నెహ్రూ నగర్, గోల్నాక, అంబర్పేట కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న టి. మనీషా, ఓ కాంట్రాక్టర్కు చెందిన బిల్లులను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు లంచం డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో, ఫిర్యాదుదారుడి నుంచి రూ.15,000 లంచంగా స్వీకరిస్తుండగా తెలంగాణ ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఇదే పని కోసం ఆమె ఇదివరకే రూ.5,000 తీసుకున్నారని ఏసీబీ అధికారులు తమ ప్రకటనలో తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇటువంటి ఘటనలపై ఫిర్యాదు చేయడానికి ఏసీబీ తెలంగాణ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని సూచించారు.
అంతేకాకుండా, వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (తెలంగాణ ఏసీబీ) మరియు అధికారిక వెబ్సైట్ (https://acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని ఏసీబీ అధికారులు వివరించారు.