బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంగారెడ్డిలో పోలీసుల గురించి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాడిన అసభ్య భాషను బీఆర్ఎస్ నేత జి దేవీప్రసాద్ ఖండించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానిన డిమాండ్ చేశారు. బుధవారం హైరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకున్నట్టుగా ఫలితాలు రాకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు గెలవాలని సీఎం రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి వివిధ కుంభకోణాల్లో అక్రమంగా సంపాదించిన డబ్బును ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఖర్చు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినా ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలింగ్ బూత్ల్లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేశారని అన్నారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ స్వైర విహారం చేసి ఓటర్లను భయ పెట్టారని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఫోన్ ట్యాపింగ్కు, కాల్ రికార్డింగ్కు తేడా తెలియడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ తమ ఫిర్యాదులపై ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత రాఘవేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



