– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్
నవతెలంగాణ-నిర్మల్
శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవడంలో విద్యాధికారులు విఫలమవుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్ అన్నారు. సోమవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాల నుంచి నిర్మల్ ప్రజలను మోసం చేస్తూ, ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా శ్రీ చైతన్య పాఠశాల నిర్మల్ పట్టణ కేంద్రంలో నడుపుతున్నారని అన్నారు. 8, 9,10 తరగతులకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదన్నారు. ఈ విషయం తెలిసి మండల, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు ప్రతి సంవత్సరం వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు వాళ్ల సర్టిఫికెట్ పైన నిర్మల్ అడ్రస్ రాదని, మరొక ప్రాంతం మీకు అడ్రస్ వస్తుందని పాఠశాల మోసం చేస్తుందన్నారు. ఇకనైనా విద్యాధికారులు త్వరగా స్పందించి, శ్రీ చైతన్య పాఠశాలపైన క్రిమినల్ కేసు నమోదు చేసి, విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు ఆకాష్, రాజు, కార్తీక్, అభినవ్ పాల్గొన్నారు.