నవతెలంగాణ – హైదరాబాద్: సమాజంలో ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఆరోగ్య జీవనశైలిని అలవర్చుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మరియు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యోగాకు నిత్యజీవితంలో ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గమనించాలని, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతమైన సాధన యోగా అని అన్నారు. యోగా అనేది శరీర వ్యాయమమే కాకుండా జీవన విధానంలో భాగమని, ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా యోగా చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆనందంగా ఉండాలని గవర్నర్ అన్నారు.
రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అని, “యోగా కేవలం వ్యాయామం కాదు, ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మను ఏకం చేస్తుందని, ఆరోగ్య సమస్యలకు ఇది ఉత్తమ పరిష్కారం” అని అన్నారు. యోగా చేయడానికి దృఢ సంకల్పం మరియు మంచి గురువు అవసరమని, యోగ సాధన ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం తోపాటు ప్రతి ఒక్కరు దినచర్యలో భాగంగా యోగాను అలవాటు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులలో యోగాభ్యాసం ద్వారా ఒత్తిడిని నివారిస్తుందని ఏకాగ్రతను పెంపొందిస్తుందని, ప్రతి పాఠశాలలో యోగా తరగతులు నిర్వహించాలని ఈ యోగ సాధన ద్వారా విద్యార్థులకు మానసిక స్పష్టత, శారీరక బలం మరియు ఏకాగ్రతను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. యోగ ధ్యానం అనేది ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడు సాధనమని ప్రపంచ సమాజానికి యోగా అనే గొప్ప వరాన్ని అందించిన మహర్షి పతాంజలి చిరస్మరణీయులను అన్నారు.
క్రీడలు మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసిన గడ్డ మన దేశమని, యోగాను అన్ని దేశాలకు చాటి చెప్పి వైద్యులకు పని లేకుండా ఆరోగ్యవంతులను కాపాడే సాధనమని అన్నారు. ప్రతిరోజు యోగ చేయడం ద్వారా మానసిక ఉల్లాసంతోపాటు చురుకుగా పని చేస్తారని, అదేవిధంగా యోగ ఎలాంటి వ్యాధులనైన నయం చేసే సాధనమని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత అలవర్చుకోవాలని అన్నారు. జబ్బు వస్తే ఎంతో ఖర్చు పెడతారని దానికి ముందే ఆరోగ్యంగా ఉండడానికి యోగా లాంటి అలవాట్లను పాటించినట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఆరోగ్యశాఖ సెక్రటరీ క్రిస్టినాజో చొంగత్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్. వి. కర్ణన్, యువతి యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
