రైతుల ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డిదే పూర్తి బాధ్యత : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపేటలో మొగిలి లక్ష్మణ్(45), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం పీక్లా తండాలో గులోత్ భాస్కర్(40), హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో నాలికె అనిల్(29) మరణాలకు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలన తెచ్చిన… సాగునీటి సంక్షోభం, పెట్టుబడి సాయం లేకపోవడం, పంట నష్టానికి పరిహారం అందకపోవడం వంటి కారణాల వల్లే అన్నదాతలు తమ నిండు ప్రాణాలు తీసుకున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేండ్ల ప్రస్థానంలో రైతుల ఆత్మహత్యలు 96 శాతం తగ్గాయని ఇటీవలే ఎన్సీఆర్బీ నివేదిక తేల్చిచెప్పిందని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ పాలన రాగానే రైతులు ఆత్మ హత్యలకు పాల్పడు తున్నారని విమర్శించారు. రైతులు మనోధైర్యం కోల్పోవద్దని వారికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES