ఇద్దరు మావోయిస్టులు మృతి
రెండ్రోజుల్లో ఆరుకు చేరిన మృతుల సంఖ్య
ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్ స్వాధీనం
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్, బస్తర్ రేంజ్లోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పట్టిలింగం తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జాతీయ ఉద్యానవన ప్రాంతంలో మావోయిస్టు జాతీయ ఉద్యానవన కమిటీకి చెందిన డీవీసీఎం దిలీప్ బెడ్జా, ఇతర సాయుధ మావోయిస్టులు బస చేశారన్న సమాచారం ఆధారంగా డీఆర్జీ కోబ్రా, ఎస్టీఎఫ్ సంయుక్త బృందం బీజాపూర్ జిల్లా వాయువ్య ప్రాంతంలోని అటవీ కొండ ప్రాంతాల్లో శోధన ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నెల 17న (శనివారం) ఉదయం నుంచి ఉమ్మడి బృందం, మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగాయి. ఈ ఆపరేషన్లో శనివారం మధ్యాహ్నం నాటికి ఎన్కౌంటర్ స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత, మావోయిస్టులు భద్రతా దళాల మధ్య సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
మావోయిస్టులు భద్రతా దళాల మధ్య ఆదివారం సైతం ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఆపరేషన్లో మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ ప్రాంతంలో శాంతి, భద్రత ప్రజా సంక్షేమాన్ని నిర్ధారించడానికి డీ ఆర్జి కోబ్రా, స్థానిక పోలీసు దళాలు, కేంద్ర పారామిలిటరీ దళాల సిబ్బంది అత్యంత అంకితభావం వృత్తిపరమైన నిబద్ధతతో తమ విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. శనివారం, ఆదివారం జరిగిన బీజాపూర్ సెర్చ్ ఆపరేషన్లో నలుగురు మహిళా కేడర్లతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. వారి మృతదేహాలతోపాటు రెండు ఏకే-47 రైఫిల్స్, ఒక ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్ ఒక కార్బైన్తో సహా ఆరు గ్రేడెడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ నిర్వహించిన గుర్తింపు ప్రక్రియ ఆధారంగా, మరణించిన మావోయిస్టు కేడర్లను నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన డీవీ సీఎం దిలీప్ బెడ్జా, ఏ సీఎం మద్వి కోసా, ఏసీఎం లక్కీ మద్కం, సభ్యురాలు రాధా మెట్టాగా గుర్తించారు. మరో ఇద్దరు మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.



