నవతెలంగాణ హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫారసు చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈనెల 24న హైకోర్టు విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈనెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 12,733 పంచాయతీ, 1,12,288 వార్డుల్లో డిసెంబరు 16 వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ ఎన్నికలను చాలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ స్పష్టం చేసింది.



