ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత రైతులు
మరో విడుత భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో నిమ్జ్ భూసేకరణపై చర్చించకుండానే వెనుదిరిగిన జేసీ
నవతెలంగాణ-ఝరాసంగం
భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు రావల సిన పరిహారం అందించకుండానే మొదటి విడతలో సేకరించిన భూముల్లో పనులు చేపట్టడం సరైందికాదని, ఇప్పుడు మరో విడత భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామ భూ భాదిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో 195.13 గుంటల భూమిని రెండవ విడతలో సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జులై 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 నెలల తర్వాత డిసెంబర్ 23న రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామంలో సభ నిర్వహించారు.
మొదటి విడతలో దాదాపు గ్రామానికి చెందిన 1800 ఎకరాల భూమిని ఇచ్చామని, మిగిలిన కొద్దిపాటి భూమి సారవంతమైందని, మూడు పంటలు పండే భూమి ని ఇచ్చే ప్రసక్తే లేదని భూమి కోల్పోతున్న రైతులు, రైతు కూలీలు ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. దాం తో చేసేదేమీలేక అధికారులు వెను దిరిగిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నిమ్జ్ రెండవ విడత భూసేకరణ ప్రక్రియను పరిశీలించడానికి జాయింట్ కలెక్టర్(జేసీ) మాధురి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో నిమ్జ్ భూ భాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తుండటంతో ఆమె తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోటిఫికేషన్ రద్దుచేయాలని రైతుల ఆందోళన
తహసీల్దార్ కార్యాలయానికి జేసీ వస్తున్నారని తెలుసుకున్న ఎల్గోయి గ్రామ రైతులు.. శనివారం ఉదయమే వచ్చి కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన చేపట్టారు. జేసీ రైతులతో మాట్లాడకుం డానే వెనుదిరిగిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూ బాధిత రైతులు మాట్లాడుతూ.. పిలిపించి మాట్లాడకుండా వెళ్లడం అవమానించడమేనంటూ తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయ సేకరణ అనేది గ్రామ పంచాయతీల్లో రైతులను అడిగి తెలుసుకోవాలని, ప్రజాభిప్రాయ సేకరణ అనేది పంచాయతీలో జరగాలి కానీ ఇలా ప్రభుత్వ కార్యాలయంలో కాదని నిమ్జ్ ప్రాజెక్టు స్పెషల్ అధికారి విశాలాక్షిని రైతులు నిలదీశారు. అనంతరం ఆర్డీఓ దేవుజాను కలిసి ఇప్పటికే సేకరించిన భూమికి 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు, రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని కోరారు. రోజుకో అధికారి బదిలీ కావడంతో కొత్తగా వచ్చిన వారికి మళ్ళీ మొదటి నుంచి వివరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
తహసీల్దార్పై అసహనం వ్యక్తం చేసిన జేసీ
నిమ్జ్ రెండవ విడుత భూసేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందన్న విషయంపై సమీక్షించేం దుకు శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన జేసీ మాధురి.. భూ బాధిత రైతులు ఆందోళన చూసి తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జేసీ తిరిగి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు తమ సమస్యలను ఏకరవుపెట్టారు. బిడకన్నె గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు.. సంవత్సరాల తరబడి భూ సమస్యను పరిష్కరించాలని కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్యను పరిష్కరించడంలేదని, మీరైనా సమస్యను పరిష్క రించాలని జేసీ కాళ్ళపై పడబోగా సిబ్బంది అడ్డుకు న్నారు. మేదపల్లి గ్రామానికి చెందిన నర్సిములు అనే రైతు మండలంలో అనుమతి లేకుండా ప్రయివేట్ వెంచర్లకు ఎర్రమట్టి తరలిస్తున్నా తహసీల్దార్ పట్టించుకోవడంలేదని, మాముళ్లు తీసుకొని వారికి సహకరిస్తున్నారని, రిజిస్ట్రేషన్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని వెంటనే తహసీల్దార్ను బదిలీ చేయాలని జేసీకి తెలిపారు.



