నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం ఎస్ఐ మహేందర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు,ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు.చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల గురించి హితవు పలికారు.యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు.
ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన పోలీసులకు సమాచారం అందివాలని అప్పుడు మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు పోలీసు వారికి తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కమల, ఉపాధ్యాయులు నాగనాథ్, సుదర్శన్ రెడ్డి, కానిస్టేబుల్ రమేష్,వెంకటేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.