ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సంప్రదాయ తెలుగు వస్త్రధారణ అయిన పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి నందమూరి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిన విషయం విదితమే. నటుడిగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్గా అందిస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
