లోతట్టు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించండి
క్షేత్ర స్థాయిలో పని చేయండి : వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసం నుంచి సీఎం.. ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని దిశానిర్దేశం చేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదమున్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం చోటుచేసుకోకుండా రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES