అది సంపన్నుల ఆయుధం
భవష్యత్తుకు భారీ ముప్పు
టెక్ నిపుణులకు తొలగింపు భయాలు
మంచి కంటే కీడే ఎక్కువ : ఏఐ పితామహుడు హింటన్ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మాటే వినబడుతున్నది. ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలనే ఆరాటం, దీని మీద ఆధారపడి పనిని సులువు చేసుకుంటున్న తీరు కనబడుతుంది. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఏఐ పరుగులు పెడుతోంది. ఈ ఏఐతో మంచి కంటే కీడే ఎక్కువగా ఉందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతోన్న వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహిత జెఫ్రీ ఎవరెస్టు హింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సంపన్నుల చేతుల్లో ఆయుధంగా మారుతుందనీ, తక్కువ పెట్టుబడితో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తారనీ, అదే సమయంలో టెక్ నిపుణులను భారీగా తొలగిస్తారని స్పష్టం చేశారు. భవిష్యత్ టెక్ ప్రపంచ ఎలా ఉండబోతున్నదనేది హింటన్ వెల్లడించారు.
ఇది పెట్టుబడిదారీ విధానం : హింటన్
బ్రిటిష్-కెనడియన్ జాతీయుడైన జెఫ్రీ ఎవరెస్టు హింటన్ కంప్యూటర్ సైంటిస్టు, కాగ్నిటివ్ సైకాలజిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత. ఏఐ న్యూరల్ నెట్వర్క్లపై చేసిన పరిశోధనలకు ఆయన ప్రసిద్ధి చెందారు. హింటన్ మాట్లాడుతూ… ఏఐ భవిష్యత్లో తీవ్ర ముప్పును కలిగించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలు ఏఐని ఉపయోగించి, ఉద్యోగుల సంఖ్యను అమాంతం తగ్గిస్తారనీ, కొత్త నియామకాలు నిలిపివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో నిరుద్యోగం ఊహించని స్థాయికి చేరుకుంటుందనీ, అంచనాలకు అందని విధంగా కంపెనీల యజమానులు దండిగా లాభాలు సంపాదిస్తారన్నారు. ఫలితంగా కొద్ది మంది సంపన్నులుగా మారుతారనీ, 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగజారుతారని హెచ్చరించారు. ఇది ఏఐ తప్పిదం కాదనీ, పెట్టుబడిదారుల విధానం అని ఆయన వివరించారు.
నిరుద్యోగం కంటే భారీ ముప్పు పొంచి ఉంది : హింటన్
ఉదాహరణకు పదివేల మంది కష్టపడి ఒక అంశాన్ని నేర్చుకుంటే, దీనంతటినీ ఏఐ తక్షణమే నేర్చుకుంటుంది. ఏఐ తయారీ సంస్థలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించేలా సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేశాయని హింటన్ అన్నారు. ఏఐ రాకతో ప్రారంభ దశలో నియమించుకునే గ్రాడ్యుయేట్ల ఎంపికలు తగ్గాయనీ, మున్ముందు పనిచేస్తున్న వారిని ఇంటికి పంపనున్నారని న్యూయార్క్కు చెందిన ఫెడరల్ రిజర్వ్ సర్వేలో వెల్లడయ్యిందని తెలిపారు. అయితే హెల్త్ కేర్ రంగంలో ఏఐ ప్రభావం అంతగా ఉండదన్నారు. ప్రస్తుతం ఏఐ వేగాన్ని గమనిస్తే 2026 తొలి నాళ్లలోనే నిరుద్యోగ సమస్య పెరుగుదలకు దారితీసే ప్రమాదముందని తెలిపారు. ఉద్యోగాల విషయాన్ని పక్కనపెడితే అంతకన్నా భారీ ముప్పు పొంచి ఉందని హింటన్ హెచ్చరించారు. లాభాల వేటలో పరుగెత్తే కంపెనీలు రక్షణ నిబంధనలను విస్మరించే అవకాశముందన్నారు. ఏఐతో మున్ముందు ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టమని, మంచి, చెడులు ఉన్నాయని హింటన్ అభిప్రాయపడ్డారు.



