నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా తయారీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, త్వరలో గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల నిర్వహించనున్న నేపద్యంలో సజావుగా ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా, ప్రతి ఫేజ్ లో ఏ మండలాల్లో ఎన్నికలు జరగాలో ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు.
పాత పద్ధతిలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నందున, సెప్టెంబర్ 2న విడుదల చేసిన పంచాయతీ తుది ఓటర్ జాబితా సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి నవంబర్ 22 లోపు పరిష్కరించాలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 23న ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జడ్పీ సీఈవో రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



