Tuesday, June 10, 2025
E-PAPER
Homeమానవివిక‌లాంగుల కోసం బెటర్‌ వరల్డ్‌ షెల్టర్‌

విక‌లాంగుల కోసం బెటర్‌ వరల్డ్‌ షెల్టర్‌

- Advertisement -

మానవ జీవితం.. స్ఫూర్తి, సంకల్పం, ధైర్యంతో కూడుకున్నది. దాన్ని ఏ వైకల్యం అడ్డుకోలేదు. అలా వైకల్యాన్ని అధిగమించి వికలాంగ మహిళలను శక్తివంతం చేస్తున్నారామె. ప్రభుత్వ జాతీయ యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్య రంగంలో ఎన్నో ఏండ్లు పనిచేశారు. శిశువైద్యురాలిగా, హక్కుల కార్యకర్తగా ఉన్న ఆమె వికలాంగ మహిళల కోసం పునరావాస కేంద్రమైన బెటర్‌ వరల్డ్‌ షెల్టర్‌ను స్థాపించారు. ఆమే డాక్టర్‌ ఐశ్వర్యరావు… ఇప్పుడు ఈ షెల్టర్‌ చెన్నై నగరంలో వికలాంగుల కోసం ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి జిమ్‌గా అవతరించింది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన వికలాంగ మహిళలు క్రీడల్లో రాణించడం అంటే అంత సులవైన విషయం కాదు. దాన్ని బద్దలు కొట్టి వారిని అథ్లెట్లుగా తీర్చిదిద్దేందుకే కొత్త జిమ్‌ను మొదలుపెట్టామని చెబుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
యాభై ఏండ్ల ఐశ్వర్య వృత్తిరీత్యా శిశువైద్యురాలు, వికలాంగ హక్కుల కార్యకర్త. నేడు చాలా మంది మహిళలకు చోదక శక్తి. చెన్నైలో పెరిగిన ఐశ్వర్యకు మూడేండ్ల వయసులో పోలియో సోకింది. ఈ వ్యాధి ఆమె కండరాలు బలహీనపరిచింది. దీని ఫలితంగా లోకోమోటివ్‌ వైకల్యం ఏర్పడింది. అప్పటి నుండి ఐశ్వర్య కాళ్ళు, చేతులు సరిగా పని చేయవు. అయితే ఇది ఆమె లక్ష్యాలను సాధించడంలో, అభిరుచి కోసం పోరాడడంలో అడ్డు రాలేదు. తన విద్యాభ్యాసం పూర్తిచేసి నేషనల్‌ యాంటీ-రెట్రోవైరల్‌ థెరపీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఒక దశాబ్ద కాలం పాటు ప్రజారోగ్య రంగంలో పనిచేసిన తర్వాత ఐశ్వర్య 2016లో బెటర్‌ వరల్డ్‌ షెల్టర్‌ను స్థాపించారు. ఇది వికలాంగులైన మహిళల కోసం ఒక పునరావాస కేంద్రం.
దూరం చేయబడుతున్నారు
చాలా మంది వికలాంగులైన మహిళలు తమకంటూ ఒక గుర్తింపును పొందడానికి ప్రయత్నిస్తారు. అయితే వివక్ష, హింస, ఎగతాళి వంటి వాటిని వారు ఎదుర్కోవలసి వస్తుంది. దాంతో విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాల నుండి దూరం చేయబడుతున్నారు. ఉదాహరణకు యునెస్కో, వరల్డ్‌ బ్లైండ్‌ యూనియన్‌ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వికలాంగులు మూడు శాతం ఉంటే అందులో మహిళల అక్షరాస్యత రేటు ఒక శాతం. కాబట్టి ఈ పునరావాస కేంద్రం రూపంలో వారికి అడ్డంకులు లేని ప్రపంచాన్ని ఏర్పాటు చేసేందుకు నా వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నాను.
విస్మయపరిచే ప్రయాణం
ఐశ్వర్య తండ్రి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన జిల్లా మేజిస్ట్రేట్‌, కలెక్టర్‌ వంటి బాధ్యతల్లో పని చేశారు. ఐశ్వర్య తొమ్మిదేండ్లు వచ్చే వరకు పాఠశాలకు వెళ్ళలేదు. ‘నా తల్లిదండ్రులు మొదట్లో నన్ను పాఠశాలకు పంపడానికి భయపడేవారు. మా అమ్మ నాకు చదవడం, రాయడం నేర్పింది. అయితే వారు నన్ను చెన్నైలోని అన్నా నగర్‌లోని సీఎస్‌ఐ బెయిన్‌ స్కూల్లో మూడవ తరగతికి చేర్చారు. వైకల్యం ఉన్నప్పటికీ ప్రిన్సిపాల్‌ నన్ను చేర్చుకున్నారు. ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. గడ్డి పైకప్పుల కింద చదువుకోవడం, క్లాస్‌మేట్‌లతో చిలిపిగా మాట్లాడుకోవడం, పోటీపడి హోంవర్క్‌ చేయడం. అది నా జీవితంలో అత్యుత్తమ దశలలో ఒకటి’ అంటూ ఐశ్వర్య గుర్తుచేసుకున్నారు.
మొదట్లో కష్టపడ్డాను
సెకండరీ స్కూల్‌ తర్వాత ఐశ్వర్యకు తొమ్మిది ఇంజనీ రింగ్‌ కాలేజీల్లో, ఒక వైద్య విశ్వవిద్యా లయంలో ప్రవేశం లభించింది. ఆమెకు లలిత కళల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రులు పట్టుబట్టి మరీ కిల్పాక్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేర్పించారు. 1996లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రామచంద్ర మెడికల్‌ కాలేజీ నుండి చైల్డ్‌ హెల్త్‌లో డిప్లొమా చేశారు. ‘నాకు ఆసక్తి లేని సబ్జెక్టు చదవడానికి మొదట్లో చాలా కష్టపడ్డాను. ఒకానొక సమయం లో చదువు మానేసి ఇంటికి వచ్చేశాను. అయితే నెల తర్వాత మా హెడ్డాఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ నన్ను ప్రోత్సహిస్తూ, చదువును కొనసాగించ మంటూ ఒక లేఖ పంపారు. అప్పటి నుండి వైద్యం పట్ల మొగ్గు చూపడం ప్రారంభించాను, దాన్ని విలువైనదిగా భావించాను’ అని ఐశ్వర్య చెప్పారు.
విశేష సేవలు
1999లో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఐశ్వర్య అత్యవసర సహాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో విశేష సేవలు అందించే వరల్డ్‌ విజన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. కొన్నేండ్ల తర్వాత యాంటీ రెట్రో వైరల్‌ థెరపీ ద్వారా హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులకు చికిత్స చేయడంలో నైపుణ్యాన్ని పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉచిత యాంటీ-రెట్రోవైరల్‌ కార్యక్ర మంలో భాగంగా సాంకేతిక బృందా నికి అధిపతిగా ఉన్నారు. అలాగే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌)లో పరిశోధకురాలిగా పని చేశారు.
అనుకోని ఎదురుదెబ్బ
వైకల్యాన్ని అధిగమించి ఇలా వైద్య రంగంలో దూసుకుపోతున్న వేళ ఐశ్వర్యకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. కాలిపర్‌లను ఉపయోగించి నడవడానికి ప్రయత్నించే సమయంలో నాణ్యత లేని పరికరం వల్ల ఆమె తుంటిని తొలగించాల్సి వచ్చింది. ‘ఇది నాకు చాలా కష్టమైన దశ. ఉద్యోగం నుండి విరామం తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను’ అని ఆమె చెప్పారు. తిరిగి కోలుకుంటున్న సమయంలో ఆమె చాలా మంది వికలాంగ మహిళలతో సంభాషించారు. ఇన్నేండ్లు వారి కష్టాల గురించి తెలుసుకోలేక పోయినందుకు బాధపడ్డారు. వారు ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలు, పరిమితులను ఆమె అర్థం చేసుకున్నారు. వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు.
మహిళల జీవితాలను మార్చడం
ఏడాది తర్వాత కోలుకున్న ఐశ్వర్య పీడియాట్రిక్స్‌కు వెళ్లే బదులు 2016లో చెన్నైలోని నుంగంబాక్కంలో వికలాంగ మహిళల కోసం పునరావాస కేంద్రమైన బెటర్‌ వరల్డ్‌ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. మానసిక, శారీరక వైకల్యాలున్న యువతులు అభివృద్ధి చెందడానికి, విజయం సాధించడానికి సురక్షితమైన స్థలాన్ని అందించా లనే ఆలోచనతో దీన్ని ప్రారంభించారు. వికలాం గులకు బెటర్‌ వరల్డ్‌ షెల్టర్‌ ఉండేందుకు నివాసం తో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రంగానూ ఉంది.
నిధుల కొరవ వల్ల
‘ప్రభుత్వంతో పాటు కొంత మంది కార్పొరేట్‌ వ్యక్తులు నాకు చాలా సహకరించారు. కేంద్రం నిర్వహణ ఖర్చుల కోసం క్రమం తప్పకుండా గ్రాంట్లు ఇవ్వడమే కాకుండా నిరాశ్రయులు, వికలాంగ మహిళలకు ఎంతో సహకరిస్తున్నారు. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల నిధుల కొరత ఉంది. దీని కోసం నా సొంత డబ్బును ఉపయోగిస్తున్నాను. అవసరమైతే బంగారం అమ్మేస్తున్నాను’ అని ఐశ్వర్య చెప్పారు. ఈ ఆశ్రయం ఇప్పటికి లోకోమోటర్‌, స్పీచ్‌, లెర్నింగ్‌, వినికిడి, దృష్టి లోపం వంటి వివిధ రకాల వైకల్యాలున్న 55 మంది మహిళలకు ఆశ్రయిస్తుంది. వీరికి ఆభరణాల తయారీ, కుట్టుపని, క్విల్టింగ్‌, క్రీడలు, ఆర్ట్‌, ఎంబ్రాయిడరీతో సహా కాలానుగుణంగా అనేక వృత్తి శిక్షణా సెషన్‌లను నిర్వహించడం ఒక లక్ష్యమని ఐశ్వర్య చెబుతున్నారు. కరోనావైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో ఫేస్‌ మాస్క్‌లను కూడా తయారు చేయించారు. ఎవరైనా మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరిక ఉంటే వారికి సహాయం చేయడానికి ఐశ్వర్య నిధులను సమీకరిస్తున్నారు.
గౌరవంగా జీవించేందుకు
‘బయటి శిక్షకులు, నిపుణులతో సెషన్‌లను నిర్వహిస్తున్నాను. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మహిళల్లో నిద్రాణమైన నైపుణ్యాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. అంతిమంగా ఇది వారు స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు మా ఆశ్రయం నుండి ఇద్దరు మహిళలు జాతీయ స్థాయి వీల్‌చైర్‌ బాస్కెట్‌బాల్‌ మ్యాచ్‌లను గెలుచుకున్నారు. శిక్షణ తర్వాత చాలా పతకాలను సాధించారు. ఈ మహిళల విజయాన్ని చూసినప్పుడు నేను చేస్తున్న ప్రతి పని విలువైనదిగా భావిస్తున్నాను’ అంటూ ఐశ్వర్య పంచుకున్నారు.
ఫిట్‌నెస్‌ జిమ్‌
ఈ ఏడాది మార్చిలో తమిళనాడు ప్రభుత్వ మద్దతుతో ఐశ్వర్య ఆశ్రయంలో వికలాంగ మహిళల కోసం ఒక ప్రత్యేకమైన జిమ్‌ను ప్రారంభించారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఉచిత శిక్షణతో పాటు వారి శరీర అవసరాలకు అనుకూలమైన పరికరాలను అందిస్తుంది. మల్టీ స్టేషన్‌ జిమ్‌ మెషిన్‌, ఛాతీ ప్రెస్‌లు, లెగ్‌ కర్ల్స్‌, లాట్‌ పుల్‌డౌన్‌లు వంటి వివిధ వ్యాయామ పరికరాలు ఇందులో ఉన్నాయి. 41 ఏండ్ల వీల్‌చైర్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి కె.మేరీ మాట్లాడుతూ ‘మా శరీర పైభాగాన్ని బలోపేతం చేయడంలో సాధారణ జిమ్‌లు పనికి రావు. అందువల్ల మేము ఆ ఫిట్‌నెస్‌ కేంద్రాలకు వెళ్లలేకపోయాము. పైగా అవి లిఫ్ట్‌లు లేకుండా ఎత్తైన అంతస్తులలో ఉంటాయి. ఇప్పుడు మేము స్వయంగా కావలసినంత సేపు ఈ పరికరాలను ఉపయోగించుకోవచ్చు’ అన్నారు. 38 ఏండ్ల జె బెనిటా, 50 ఏండ్ల మటిల్డా ఫోన్సెకా వంటి ఇతర వీల్‌చైర్‌ ప్లేయర్స్‌ బృందం ఇటీవల కోయంబత్తూరులో జరిగిన అంతర్‌-రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌కు వెళ్లి స్వర్ణం గెలుచుకుంది, ట్రోఫీతో తిరిగి వచ్చింది.
– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -