42 శాతం రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం వెంటనే ఆమోదం ఇవ్వాలి
కవిత ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేపట్టాలి
రేవంత్ రెడ్డి పాలన దేశానికి ఆదర్శం
రైతుల సంక్షేమానికి రూ.1 లక్షా 56 వేల కోట్లు
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్
నవతెలంగాణ – కరీంనగర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తోందని, ఈ అంశంలో బీజేపీ, బీఆర్ఎస్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం మండిపడ్డారు. ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ, బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కామారెడ్డి వద్ద బీసీ డిక్లరేషన్ ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్య, ఉపాధి రంగాల్లో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ, ఇప్పటివరకు ఆమోదం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 6న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిల్లి బాబు ఆధ్వర్యంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేత అడ్లూరు లక్ష్మీకుమార్ నేతృత్వంలో, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ కార్యకర్తలతో ధర్నా విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని వివరించారు. అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ, కేంద్రంలో మాత్రం ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో నుండి తొలగించే షరతు పెట్టడం దారుణమని విమర్శించారు.గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ముందు అక్కడ ముస్లింలను బీసీ రిజర్వేషన్ల నుండి తొలగించమని మోదీకి చెప్పండి. మీ మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే డిమాండ్ పెట్టండి’’ అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి సవాలు విసిరారు.
“బీసీ ఓట్లతోనే మీరు రెండుసార్లు ఎంపీ అయ్యారు. ఇప్పుడు వారి కోసం పని చేసే సమయం వచ్చిందిఅని గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన దేశానికి ఆదర్శమని పేర్కొంటూ, రైతుల సంక్షేమానికి లక్షా 56 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ.500 బోనస్, సన్నబియ్యం పంపిణీ, ఆరు హామీల అమలు వంటి పథకాలను కట్టుబాటుతో అమలు చేస్తున్నామని వివరించారు.
బండి సంజయ్ మతపరమైనరాజకీయాలను పక్కన పెట్టి ప్రాజెక్టులు, కేంద్ర నిధులు తెచ్చే పనిలో దృష్టి పెట్టాలని సూచించారు. “టీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసిన ధర్నా చౌక్ను తిరిగి ప్రజలకు అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజాయితీ ఉంటే కవిత, కేటీఆర్, హరీశ్రావును వెంటబెట్టుకొని ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయాలని సవాలు విసిరారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాజుద్దీన్, శ్రవణ్నాయక్, కొరవి అరుణ్కుమార్, రాజు, గంగుల దిలీప్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.