అన్యాయాన్ని ఎదిరిస్తే అర్బన్ నక్సలైట్ అంటున్నారు
రాజ్యాంగ విలువలను పరిరక్షించాలంటే జస్టిస్ సుదర్శన్రెడ్డిని గెలిపించాలి : రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొ.హరగోపాల్
నవతెలంగాణ-షాద్నగర్
దేశంలో నిరుద్యోగం, అసమానతలు పెరుగుతున్నాయని, కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టేందుకు బీజేపీ ఎన్నో కుటిల ప్రయత్నాలు చేస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని పెన్షనర్ భవన్లో ‘రాజ్యాంగ విలువలు-పరిరక్షణ’ అంశంపై తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో జర్నలిస్ట్ మిద్దెల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలను పరిరక్షించాలంటే జస్టిస్(రిటైర్డ్) సుదర్శన్రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునేందుకు ఎంపీలు కృషి చేయాలన్నారు. రాజ్యాంగంపై పూర్తిస్థాయిలో పట్టు ఉన్న సుదర్శన్రెడ్డిని దేశ ఉప రాష్ట్రపతిగా ఎన్నుకుంటేనే రాజ్యాంగాన్ని రక్షించిన వాళ్లం అవుతామని వివరించారు. మనిషికి నైతిక విలువలు అనేవి ఎంతో ముఖ్యమని, ఆ విలువలు లేనప్పుడు బతకడం కూడా దండగేనని అన్నారు. రాజ్యాంగాన్ని అనేక పర్యాయాలు ఆర్ఎస్ఎస్ తిరస్కరించిందే తప్ప ఏనాడూ స్వాగతించలేదని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనా విధానం ఎంతో ప్రమాదకరంగా ఉంటుందనీ, అలాంటి కోవకు చెందిన వ్యక్తినే కేంద్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టిందని తెలిపారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మావోయిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని కేంద్ర హౌంమంత్రి అమిత్షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అన్యాయాన్ని ఎవరు ఎదిరించినా అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేయడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలందరూ పసిగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వనమాల, కాంగ్రెస్ ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు చల్లా శ్రీకాంత్రెడ్డి, సీపీఐ నాయకులు బుద్ధుల జంగయ్య, సీపీఐ(ఎం) నాయకులు ఈశ్వర్, శ్రీను నాయక్, టిజి.శ్రీనివాస్, అర్జునప్ప రవీంద్రనాథ్, నర్సింలు గౌడ్, కరుణాకర్, రవి కుమార్, జైపాల్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్, వెంకటరమణ, జనార్ధన్, రామారావు, నక్క బాలరాజ్, రవీంద్రనాథ్, శ్రీధర్రెడ్డి, సురేష్, తిరుమలయ్య, శివారెడ్డి, రవి, చంద్రారెడ్డి, చంద్రశేఖర్, జనార్దన్రెడ్డి, సురేందర్ రెడ్డి, శేఖర్రెడ్డి, చంద్రమోహన్, నరసయ్య, సుశీల పాల్గొన్నారు.