Sunday, June 8, 2025
E-PAPER
Homeజాతీయంమరో ఐదుగురు మావోయిస్టులమృతదేహాలు లభ్యం

మరో ఐదుగురు మావోయిస్టులమృతదేహాలు లభ్యం

- Advertisement -

వీరిలో ఇద్దరు మహిళలు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో స్వాధీనం

రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్క్‌ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. ఇంద్రావతి జాతీయ పార్క్‌ ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ముఖ్య నేత భాస్కర్‌ కూడా చనిపోయారు. ”మూడు రోజుల పాటు జరిగిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో ఇద్దరు సీనియర్‌ నేతలు… కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ అలియాస్‌ గౌతమ్‌, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదేలు అలియాస్‌ భాస్కర్‌…సహా మొత్తం ఏడుగురు చనిపోయారు” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులకు పట్టున్న కీలక ప్రాంతాలలో భద్రతా దళాలు గురువారం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. శుక్రవారం సుధాకర్‌, శనివారం భాస్కర్‌ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి, శనివారం జరిపిన గాలింపు చర్యలలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. అయితే వారు ఎవరన్నది తెలియరాలేదు. వీరంతా నిషిద్ధ మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సభ్యులేనని, వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలం వద్ద రెండు ఏకే-47 తుపాకులు సహా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయని ఆయన చెప్పారు. ఆపరేషన్‌లో భాగంగా పాము కాటు, తేనెటీగల దాడి, డీహైడ్రేషన్‌ వంటి కారణాలతో కొందరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని, అయితే వారి పరిస్థితి నిలకడగా ఉన్నదని వివరించారు. ఇదిలావుండగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు మావోయిస్టు నేతలను బీజాపూర్‌లో కస్టడీలోకి తీసుకొని ఒకరి తర్వాత ఒకరిని కాల్చి చంపారని పౌర హక్కుల కార్యకర్తలు, తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -