Friday, June 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబోనాలు షురూ

బోనాలు షురూ

- Advertisement -

ప్రారంభమైన ఆషాఢమాసం
తెలంగాణ సంస్కృతి, ఐక్యతకు ప్రతీక
అమ్మవారి ఆశీస్సులతో
రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలి
స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌
గోల్కొండలో తొలి బోనం సమర్పించిన స్పీకర్‌, మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో

”బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, ఐక్యతకు ప్రతీక.. అమ్మవారి ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి.. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యం..” అని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఆషాఢమాసం బోనాల ప్రారంభం నేపథ్యంలో గురువారం గోల్కొండలోని శ్రీజగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. స్పీకర్‌, మంత్రులు బోనం ఎత్తుకొని పట్టువస్త్రాలతో అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతర ం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి స్పీకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. గోల్కొండ జగదాంబ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలనీ, కొన్నేండ్ల నుంచి జంట నగరాల్లో వైభవంగా బోనాల సంప్రదాయం కొనసాగుతోందని అన్నారు. జంట నగరాల్లో నిర్వహించే బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు సీఎం రేవంత్‌రెడ్డి ముందుగానే విడుదల చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత, చరిత్ర ఉందన్నారు. జంట నగరాల్లో దారులన్నీ గోల్కొండ వైపే ఉన్నాయనీ, ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని అన్నారు. అలాగే ప్రజలకు పోలీసులు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గతం కంటే మెరుగ్గా అన్ని ఏర్పాట్లూ చేసిందన్నారు. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆషాఢ మాసంలో సంప్రదాయ రీతిలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం.. అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రభుత్వం ఈ బోనాల నిర్వహణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాల్లో ఎక్కడా ఎలాంటి సంఘటనలూ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మెన్‌ నిరంజన్‌, దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌, కమిషనర్‌ వెంకట్రావు, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, ఆలయ కమిటీ చైర్మెన్‌ చిట్టిబాబు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -