బుద్ధుడు చెప్పిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి, ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చాయి. బుద్ధుడి స్ఫూర్తితోనే ఎంతో మంది తాత్వికులయ్యారు. కవులు, రచయితలయ్యారు. రాజకీయ నాయకులయ్యారు. విప్లవ వీరులయ్యారు. సిద్ధాంత కర్తలయ్యారు. మేధావులయ్యారు. వీరు మాత్రమే కాకుండా బుద్ధుడు చెప్పిన ఒక సిద్ధాంతంతో చాలామంది శాస్త్రవేత్తలయ్యారు. పరిశోధకులయ్యారు. ఆయన చెప్పిన అనేక విషయాలలో ఈ ఒక్క సిద్ధాంతం విశ్వవ్యాప్తంగా ప్రభావం చూపింది. అదేమంటే – కార్యకారణ సిద్ధాంతం. ఆ ఒక్కమాటతో ఆయన వైజ్ఞానికులకే వైజ్ఞానికుడయ్యాడు. ఏ కార్యం జరిగినా, దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని అన్వేషించి, అర్థం చేసుకుంటే గాని దాన్ని నివారించడానికి మార్గాలు వెతుక్కోవచ్చు – అన్నది బుద్ధుడి కార్యకారణ సిద్ధాంతం! ఎక్కడ ఏ ప్రగతి లేని రోజుల్లో, మానవ మేధస్సు వికసించని దశలో, బుద్ధుడు సుమారు రెండున్నర వేల ఏండ్ల క్రితం ఆ విషయం చెప్పడం మామూలు విషయం కాదు.
ఈ రోజు వైజ్ఞానిక ప్రపంచమంతా ఈ సూత్రం చుట్టే తిరుగుతూ ఉండడం మనం గమనించొచ్చు. బుద్ధుడు ఏం చెప్పాడూ? ప్రపంచంలో దు:ఖం ఉంది. దానికి కారణముంది. కారణముంది కాబట్టి, నివారణ ఉంది. నివారణ ఉంది. కాబట్టి అందుకు మార్గాలున్నాయి – అన్నాడు. దీని మీద ఆధారపడి కారల్ మార్స్ మరో సిద్ధాంతం చెప్పాడు. ఆయన ప్రపంచంలోని పేదరికాన్ని, ఆణచివేతను, అసమానతను గుర్తించాడు. ఆ విషయాన్నే తన సిద్ధాంతంగా చెప్పారు. ప్రపంచంలో పేదరికం ఉంది. పేదరికం ఉంది కాబట్టి అసమానత, అణచివేత ఉన్నాయి. పేదరికానికి కారణాలు తెలుసుకుం టేనే, ఆ కారణాలకు నివారణలు తెలుసుకోవచ్చు. ఆ నివారణకు దారులే సమసమాజ స్థాపన – క్రాంతి- విప్లవం – అని వివరించాడు మార్క్సు!
నేటి ఆధునిక వైద్య శాస్త్రమైనా ఏం చెబుతుంది? ప్రపంచంలో రోగాలున్నాయి. రోగాలున్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలున్నాయి. అవి ఉండడానికి కారణాలున్నాయి. ఆకారణాలు బాక్టీరియా, వైరస్ లే కావచ్చు, వారసత్వ లక్షణాలే కావొచ్చు. మరింకేదైనా కావచ్చు. కారణాలే వైనా అందుకు నివారణలు న్నాయి. అ నివారణలకు వేర్వేరు దారులున్నాయి. ఆ దారులేమిటీ? చికిత్స, థెరపీ, ఆపరేషన్ వగైరా ఏదైనా కావొచ్చు. ఒక్క వైద్యశాస్త్రమే కాదు, ఇతర అన్ని శాస్త్రాలు ఆ ఒక్క కార్యకారణ సిద్ధాంతంలోంచి వెలువడ్డవే. ఉదాహరణకు తొలి రోజుల్లో మనిషి చేవను చూశాడు. చేప నీటిలో ఈదడం చూశాడు. అది ఎలా తేలగలుగుతోందో, అది ఎలా ఈద గలుగుతుందో? వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకున్నాడు. కాలక్రమంలో నీటిపై తేలుతూ ప్రయాణించ గల పడవకు, ఓడకు, స్టీమర్కు రూపకల్పన చేసుకున్నాడు. అలాగే మనిషి పక్షిని గమనించాడు. అది రెక్కలాడిస్తూ, గాలి ఒత్తిడితో పైకి లేవగలగడం అధ్యయనం చేశాడు.
దాని వెనకగల కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకుని విమానాల్ని తయారు చేసుకున్నాడు. గద్ద ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీద గల చిన్న కోడి పిల్లను ఎలా చూడగలుగుతోందో పరిశీలించి, లెన్స్ల్ని ఆవిష్కరించుకున్నాడు. దూరపు చూపు దగ్గరి చూపునకు తగిన కటకాల్ని తయారు చేసుకున్నాడు. ఆవిరి ఎంత బలమైందో జేమ్స్ వ్యాట్ గ్రహించగలిగాడు కాబట్టి – ఆవిరి యంత్రానికీ ఇంజన్కు, రైలుకు ఆవిష్కరణలు జరిగాయి. ప్రతి కార్యానికీ కారణముంటుందన్న విషయం గ్రహించిన శాస్త్రవేత్తలంతా తమ తమ రంగాలలో పరిశోధనలు కొనసాగించారు. నూతన ఆవిష్కరణలతో విశ్వమానవాళికి మేలు చేస్తూ వచ్చారు. ఈ విషయంలో శాస్త్రవేత్త లంతా బుద్దుని అనుచరులే! కార్యకారణ సిద్ధాంతం పదహారవ శతాబ్దంలో యూరోప్కు చేరినప్పుడు, అక్కడ బేకన్, న్యూటన్, కెప్లర్, గెలీలియో వంటి మహా శాస్త్రవేత్తలంతా తయారయ్యారు. ఈ రకంగా చెప్పాలంటే భారతదేశం ‘విశ్వ గురువు’ ఎప్పుడో అయిపోయింది. కాస్త చదువూ, జ్ఞానం, విజ్ఞత ఉన్నవారికి ఈ విషయం తెలుస్తుంది. అది లేనివారే ఇప్పుడీ దేశాన్ని కొత్తగా ‘విశ్వ గురువు’గా నిలబెడతామని బయలుదేరుతున్నారు. అది వారి అజ్ఞానాన్ని బయటపెడుతుంది.
భారతదేశం ప్రపంచానికి ఏమిచ్చింది అంటే బుద్ధుణ్ణి ఇచ్చింది. బుద్ధుడు ప్రపంచానికి ఏమిచ్చాడంటే – కార్యకారణ సిద్ధాంతాన్నిచ్చాడు. ఎక్కడ ఏ ఆధారాలూ లేని రోజుల్లో ఏ పరిశీలనలు, ఏ పరిశోధనలూ జరగని రోజుల్లో బుద్దుడు ఆ సిద్ధాంతాన్ని ఇచ్చాడంటే మాటలా? ఆయనకు జ్ఞానోదయమైందంటే ఇదే – ప్రపంచానికి ఆయన జ్ఞానాన్నిచ్చాడంటే ఇదే! ఆ ఒక్క సిద్ధాంతం మీదే అన్న ఆధారపడి ఉన్నప్పుడు, వైజ్ఞానిక పరిశోధనలన్నీ ఇప్పటికీ ఆ సిద్ధాంతం మీదే ఆధారపడి జరుగుతున్నప్పుడు – ఇన్ని శతాబ్దాల తర్వాత మనం ఆయనను ఏ స్థాయిలో నిలుపుకోవాలి? అందుకే ప్రజలు ఆయనను ‘భగవాన్’ అన్నారు. భగవా అని అంటే పరిపూర్ణుడు అని అర్థం! బుద్ధుడు చెప్పిన విషయాలేవీ మిగలకపోయినా, ఈ ఏకవాక్య సిద్ధాంతం మిగిలినా, ఆయన బుద్ధుడిగానే మిగిలి ఉండేవాడు. ఎందుకంటే ఈ ఒక్క ఆలోచనే ప్రపంచగతిని మార్చింది. ఎన్నో వైజ్ఞానిక సిద్ధాంతాలకు ఇది మూలం అయ్యింది. బీజమైంది. మాతృక అయింది. జీవితానికి సంబంధించి బుద్ధుడు ఎన్నో విలువైన విషయాలు చెప్పాడు. అవన్నీ మానవ ప్రవృత్తికి, సమాజగతికి సంబంధించినవి.
ఈ కార్యకారణ సిద్ధాంతం మాత్రం ప్రగతికి, పురోగతికి, అభ్యున్నతికి, విప్లవానికీ సంబంధించింది. శతాబ్దాలు గడుస్తున్నా ఆ సిద్ధాంతం ఎప్పటికప్పుడు ఎక్కడి కక్కడ అన్వయించుకునే విధంగా ఉంటూనే ఉంది. తరం తర్వాత తరంలో ఇది మనిషిని ఆధునికుణ్ణి చేస్తూనే ఉంది. అది నిత్యనూతనం! బుద్ధుణ్ణి ఒక సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, తాత్వికుడిగా ముఖ్యంగా మార్గదర్శిగా చూడకుండా ఆయనను దేవుళ్లలో కలపడం, ఆయనకు మతాన్ని పులమడం – ఆలోచన లేని కొందరు చేసిన పిచ్చి పని. పరిపూర్ణుడు గనకనే శతాబ్దాలకు ముందే ఆనాటి ప్రజలు ఆయనను భగవాన్గా పూజించారు. శతాబ్దాల తర్వాత ఈనాడు కూడా ఆధునిక ఆలోచనాపరులు ఆయన మేధోశక్తికి అబ్బురపడి ఆరాధిస్తున్నారు. ఆస్ఫూర్తిని నిలుపుకుని, వచ్చే తరాలకు అందించాలనుకుంటున్నారు. పూజ- అంటే అదే. పూలు, కుంకుమ జల్లి, గంటలు మోగించి, అర్ధం లేని, అర్థం కాని సంస్కృత శ్లోకాలు చెప్పడం పూజకాదు. అది దారితప్పిన మనువాదుల పైత్యం! వారి దృష్టిలో భగవాన్ అంటే అస్తిత్వం లేనివాడు.
కేవలం విశ్వాసంలో తిష్టవేసిన వాడు -మాత్రమే! వీరి దేవుడు మనిషి బుర్రలో పుట్టి, మనిషినే బానిసగా లేదా మూర్ఖుగా చేసినవాడు మాత్రమే! పదిహేడవ శతాబ్దంలో బుద్ధుడి కార్యకారణ సిద్ధాంతం అందుబాటులోకి వచ్చిన తర్వాతనే యూరోప్లో వైజ్ఞానిక విప్లవం వచ్చింది. అంతకు ముందు అక్కడ ఏదైనా జరిగిందంటే దానికి కారణం ధార్మిక, ఆధ్యాత్మిక, దైవ కారణాల్ని వెతుక్కునే వారు. ఇది అప్పటి వారి రచనల్లో దొరికిన అంశమే. బుద్ధుడు తన బోధనల్ని నాటి ప్రజల భాష అయిన పాల భాషలో బోధించాడు. అందువల్ల అతడి బోధనలతో పాటు ఆ పాలి భాష ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడింది. ఉదాహరణకు కొన్ని ముఖమైన పదాలు చూద్దాం. ధ్యానాన్ని పాలి భాషలో ‘ఝాన్’ అంటారు. దాన్ని మన భారత దేశంలో వైదిక మతస్తులు ధ్యానంగా మార్చారు. ఇదే పదం చైనాకు పోయి ‘చాన్’ అయ్యింది. అక్కడ ‘చాన్’ సంప్రదాయం ఏర్పడింది. అలాగే పాలి భాషలోని ఝాన్ పదం జపాన్లో జేన్ అయింది. అది పాటించే ‘జేన్’ సంప్రదాయం అక్కడ వర్ధిల్లింది. ఇదే ఝాన్ కొరియాలో ‘సార్ జాన్’ అయింది. వియత్నాంలో ‘థియాన్’ అయింది. ఇలా వేరు వేరు దేశాల్లో ఆ పదం వేరు వేరుగా వాపించింది.
ఇంతెందుకు? మనం మన ఊళ్ల పేర్లలో సామాన్యంగా ‘పల్లి’ అని ఉండడం చూస్తుంటాం. అది పాలి భాషలోంచి వచ్చిందే. ఇరాండ్ పల్లి – అనే ఊరు శాసనాలలో కూడా కనిపించింది. పల్లి అంటే పాలి భాషలో నగరం అని అర్థం. పర్షియా రాజధాని పర్సిపోలిస్లో పోలిస్ అంటే నగరం – అనే అర్థం ఉంది. ఇవన్నీ బుద్ధుడి బోధనలతో పాటు వేర్వేరు భాషల్లోకి ప్రవేశించిన పదాలు. అందుకే మూలాల్లోకి వెళ్లాలి. డాక్టర్ రామ్ విలాస్ శర్మ వృత్తిరీత్యా ఇంగ్లీషు ప్రొఫెసర్. భాషాశాస్త్రజ్ఞుడు కూడా. బౌద్ధమతా భిమాని అయినందువల్ల ఆ విషయాలలో విస్తృతంగా పరిశోధనలు చేశారు. పాలి భాషా పదాలు వివిధ దేశాలకు ఎలా ప్రయాణించాయన్న విషయం ఆయన చాలా వివరంగా రాశారు. థెరపీ థియరీ వంటి పదాల గురించి కూడా ఆయన వివరణ ఇచ్చారు. తార్కిక విశ్లేషణలతో లభించేది ‘ధేర్’ అని పాలిభాషలో బౌద్ధం చెపుతుంది. అస్మా (నమ్మకం-విశ్వాసం) నుండి వేదాలు వచ్చినట్లుగా తార్కిక దృక్పథంతో ‘ధేర్ ‘ వచ్చింది. ధర అంటే పెద్దవారు. అన్ని తెలిసిన విజ్ఞుడు.
దాని మూలం ఇటాలియన్, లాటిన్, గ్రీకు అని చెపుతుంటారు కదా? చాలాకాలానికి ముందు ఈ’ధేర్’ అనుయా యుతే ఈజిప్టులో ‘దేరాపుటి’ అని పిలవబడేవారు. వీరు చికిత్సకులు. వీరి వల్లనే థెరపి/ థియరీ వంటి పదాలు విశ్వవాప్తమయ్యాయి. వైదిక మతస్తులు సృష్టించుకున్న ముప్పయి మూడు కోట్ల దేవీ దేవతల్లో ఏ ఒక్కరూ సజీవంగా పుట్టి మనిషికి దిశానిర్ధేశం చేసిన వారు లేరు. ఇతర మతాలలో కూడా అదే పరిస్థితి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.-మత గురువులు ఉన్నారే గానీ, అసలు ‘దైవం’ వంటి వారు ఎవరూ లేరు. కనీసం ఏదో ఓకాలంలో ఉండి అంతరించి పోయారన్న ఆధారాలు కూడా లేవు. ఈ తేడాను గమనించి అర్థం చేసు కోగల స్తోమత గల వారికి మాత్రమే విషయం అర్థమవుతుంది. ఏదో ఒక మత విశ్వాసంలో బలంగా పాతుకుపోయిన వారికి బహుశా ఈ విషయాలు నచ్చక పోవచ్చు. అబద్దాల్లో సుఖాల్ని వెతుకునే వారికి నిజాలు ఇబ్బందిగానే ఉంటాయి.
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
డాక్టర్ దేవరాజు మహారాజు



