మధురవాడ : విశాఖ నగరంలోని రుషికొండ బీచ్ రోడ్డులో మంగళవారం ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయివేటు ట్రావెల్స్కు చెందిన బస్సు మంగళవారం ఉదయం విశాఖ నగరం నుంచి రుషికొండ వైపు వెళ్తుండగా బీచ్ రోడ్డు దగ్గరకు వచ్చేసరికి ఇంజన్ నుంచి ఒక్కసారిగా పొగ రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యి వెంటనే బస్సులో నుంచి కిందకు దూకేశాడు. చూస్తుండగానే అగ్నికీలలు బస్సును చుట్టేయడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారులు, పిఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని పోలీసులు భావిస్తున్నారు. పిఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బాలకృష్ణ తెలిపారు.



