ధ్వంసం చేసిన పోలీసులు..ఎండు గంజాయి స్వాధీనం
పోలీసులపై తండావాసుల దాడి!
నవతెలంగాణ-నారాయణఖేడ్ రూరల్
పత్తి చేనులో మిశ్రమ పంటగా వేసిన గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేయడంతో తండావాసులు వారిపై దాడి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చల్లగిద్దా తండాలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. చల్లగిద్ద తండాకు చెందిన జానకిరామ్ పత్తి చేనులో గంజాయి మొక్కలను సాగు చేసినట్టు నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు అక్కడికి వెళ్లి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. నిందితుడు జానకిరామ్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, తండాకు చెందిన వడిత్య దశరథ్, వడిత్య మోహన్ ఇంటిపై దాడి చేసి 4.2 కిలోల ఎండు గంజాయిని, 1.5 కిలోల గంజాయి విత్తనాలను, ద్విచకక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో తండావాసులు అధికారులను, సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడులు చేసి గాయపర్చారు. పోలీసుల ఫోన్లను కూడా లాక్కున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ వెంకటరెడ్డి పోలీసు సిబ్బందితో తండాకు వెళ్లి తండావాసులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ రఘునాథ్ రెడ్డి చెప్పారు.