వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి తొలి దశ
జమ్మూకాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్,
హిమాచల్లో నిర్వహణ
ఆ తర్వాత 2027 మార్చి 1 నుంచి రెండో దశ
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కులగణనను రెండు దశలుగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది. 2026 అక్టోబర్ 1 నుంచి చేపట్టే తొలి దశలో జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో నిర్వహించనున్నారు. మంచు ప్రభావం ఉన్న ఈ ప్రాంతాల్లో తొలుత ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. రెండో దశను 2027 మార్చి 1 నుంచి చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. 2027 మార్చి 1 నుంచి రెండో దశలో చేపట్టే కులగణనకు సంబంధించిన అధికారిక గెజిట్ను ఈనెల 16న కేంద్రం విడుదల చేసే అవకాశమున్నదని కేంద్రహౌం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. దేశంలో సామాజిక న్యాయం, సంక్షేమ విధానాలు, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొనేందుకు ఈ కులగణన చేపట్టాలనే వాదన చాలా కాలంగా దేశంలో బలంగా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహించాలంటూ కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో పాటు ఇండియా బ్లాక్ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్నాటక, తెలంగాణల్లో సైతం ఈ కులగణన సర్వే జరిగింది. దీంతో కేంద్రంపై ఈ కులగణన సర్వే అంశంలో తీవ్ర ఒత్తిడి వచ్చింది. కులగణనపై మోడీ ప్రభుత్వం తొలుత నిరాకరించింది. కానీ, దీనిని దేశవ్యాప్తంగా నిర్వహించాలంటూ అన్ని రాజకీయ పార్టీలూ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో కులగణన చేపట్టేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో జనగణనతోనే కులగణన కూడా చేపట్టాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం 2021లో జనగణన నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా ఆ సమయంలో జనగణన జరగలేదు. అయితే, 2027లో జనగణనతోపాటు కులగణన సైతం నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2029లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికే ఈ కులగణనతోపాటు జనగణన చేపట్టాలని చూస్తోంది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన సైతం జరగనున్నది. దానికి ముందే ఈ గణన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
రెండు దశలుగా కులగణన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES